సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా ఏసీబీ వలకు చిక్కుతున్నాయి. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో డీజీపీ ఆఫీస్ స్టేషనరీ వింగ్లో పనిచేస్తున్న డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఉదయం నుంచే ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. భీమ్రెడ్డి సంపాదించిన అక్రమాస్తుల విలువ సుమారు రూ. 200 కోట్ల పైమాటేనని తెలుస్తుండటంతో పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.
డీఎస్పీ భీమ్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, అత్యంత ఆప్తులైన బినామీల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు గురిపెట్టారు. హైదరాబాద్, జహీరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఈ సోదాల సమయంలో ఏసీబీ అధికారులకు ఒక అత్యంత కీలకమైన డైరీ లభ్యమైంది. ఈ డైరీలో డీఎస్పీకి చెందిన దాదాపు 15 మంది ముఖ్య బినామీల పూర్తి చిట్టా ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఒక బినామీ ఇల్లాంటి రహస్య స్థావరం నుంచే రూ. 40 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భీమ్ రెడ్డి కేవలం సొంత రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. గచ్చిబౌలిలోని ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ను తన కూతురి పేరిట కొనుగోలు చేయగా, బెంగళూరు నగర పరిధిలో ఒక ఎకరం ఖరీదైన భూమి ఉన్నట్లు డాక్యుమెంట్లు లభించాయి. వీటితో పాటు పలు ఓపెన్ ప్లాట్లు, సాగు భూములకు సంబంధించిన కీలక ల్యాండ్ డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
భీమ్ రెడ్డి అక్రమ సామ్రాజ్యం చాలా పెద్దదిగా ఉన్నందున, బ్యాంక్ లాకర్లు, బినామీల ఖాతాలను పూర్తిగా పరిశీలించడానికి మరో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించాల్సి ఉంటుందని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇప్పటికే కొండలా పేరుకుపోయిన అక్రమాస్తుల ఆధారాలు లభించడంతో, మరికొద్ది సేపట్లోనే డీఎస్పీ భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు అధికారికంగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


