ఏసీబీ అన్నా.. ఏం భయం లేదన్నాడు | ACB Raids in Aswaraopeta | Sakshi
Sakshi News home page

ఏసీబీ అన్నా.. ఏం భయం లేదన్నాడు

Jun 30 2026 8:28 AM | Updated on Jun 30 2026 8:29 AM

ACB Raids in Aswaraopeta

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అనగనగా ఒక రైతు. ఆయన పొలానికి మట్టి తరలింపు అనుమతికి ఓ ఉద్యోగి లంచం అడిగాడు. ఇలాగే లంచం అడిగిన ఓ అధికారిని ఏసీబీకి పట్టించానని రైతు హెచ్చరించాడు.. కానీ అవినీతి అధికారి తేలిగ్గా తీసుకున్నాడు.. లంచం ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పాడు.. రైతు నుంచి రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై.రమేశ్‌ తెలిపిన వివరాలివి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో ఏఈఈగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్‌.శ్రీనివాస్‌ను ఓ రైతు తన పొలానికి చెరువు మట్టి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు.

 కొద్ది రోజులుగా తిరుగుతుండగా, మట్టి తరలింపునకు రూ.4 లక్షలు ఇవ్వాలని ఏఈఈ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. చివరకు రూ.2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. ఈ మేరకు సోమవారం రాత్రి కార్యాలయంలో బాధిత రైతు నుంచి ఏఈఈ రూ.2 లక్షలు తీసుకుని తన డెస్క్‌లో పెట్టుకోగా.. ఏసీబీ అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకోవడంతో ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. 

ఏసీబీ పేరు చెప్పినా..:
ఏఈఈ శ్రీనివాస్‌ను ఇంకొందరు రైతులు కూడా చెరువుల నుంచి మట్టి తరలింపునకు అనుమతి ఇవ్వాలని కోరితే లంచం డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. అయితే, ఇదే రైతు తాను గతంలో ఓ ఉద్యోగిని ఏసీబీకి పట్టించానని చెప్పినా.. లంచం ముట్టచెబితే తప్ప అనుమతి ఇచ్చేది లేదని శ్రీనివాస్‌ తెగేసి చెప్పినట్లు సమాచారం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement