తెలంగాణ జాతీయ రహదారుల విస్తరణకు రూ.7,597.16 కోట్లు కేటాయింపు
ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల, జగిత్యాల–కరీంనగర్ మార్గాల అభివృద్ధి
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఇప్పటికే పేర్కొన్న రైల్వే
రైల్వేనే చూసుకోవాలని తేల్చి చెప్పేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల (ఎన్ హెచ్–63), జగిత్యాల–కరీంనగర్ (ఎన్హెచ్–563) జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించే భారీ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 190.76 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ రహదారుల విస్తరణ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.7,597.16 కోట్లను కేటాయించింది. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల మీదుగా వెళ్లే ఈ రహదారుల విస్తరణతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రద్దీని నివారించేందుకు ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల, పోతారం, గంగాధర తదితర ప్రాంతాల్లో బైపాస్లు ఏర్పాటు చేయనున్నారు. ఓపెన్ టోలింగ్ విధానం(టోల్బూత్ల వద్ద వాహనాలు ఆగకుండా, నేరుగా హైవే వేగంతో ప్రయాణించడానికి అనుమతించే ఆధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థ)తో వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ నాలుగు లేన్ల మార్గాన్ని డిజైన్ చేశారు. రహదారుల విస్తరణ పూర్తయితే ఆర్మూర్ నుంచి మంచిర్యాల మధ్య సుమారు గంటన్నర ప్రయాణ సమయం ఆదా కానుంది. జగిత్యాల నుంచి కరీంనగర్ మధ్య 45 నిమిషాల ప్రయాణ సమయం కలసిరానుంది. ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలకు సురక్షితమైన, వేగవంతమైన కనెక్టివిటీ లభించనుంది.
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ ఖర్చు అంటేనే రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తాల్సి వస్తోంది. భూసేకరణ ప్రక్రియే చాలా క్లిష్టమైంది కావటంతో దాన్ని కొలిక్కి తేవటం పెద్ద సవాలుగా ఉంటే, దాని వ్యయాన్ని భరించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే మధ్య రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు వివాదం నెలకొంటోంది. రీజినల్ రింగురోడ్డుకు అనుసంధానంగా రింగు రైలు ప్రాజెక్టును చేపట్టాలని రైల్వే శాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతించటంతో ఆ ప్రాజెక్టు ముందడుగేసింది. ఇక్కడే ఇప్పుడు పేచీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. భూసేకరణకు సంబంధించి ఇప్పుడు కసరత్తు ప్రారంభించాల్సి ఉంది. దీంతో భూసేకరణ బాధ్యత మీదంటే మీదే అన్నది తెరమీదకు వస్తోంది. రీజినల్ రింగురోడ్డును ఆనుకొని రైల్వే లైన్ నిర్మించాలన్నది ఆలోచన. ఇప్పటికే రీజినల్ రింగురోడ్డుకు 100 మీటర్ల వెడల్పుతో ఉత్తర భాగానికి అలైన్మెంట్ ఖరారైంది.
దక్షిణ భాగానికి ఇంకా కొలిక్కి రాలేదు. ఉత్తర భాగానికి అనుమతి ఇచ్చే సమయంలో, ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా రోడ్డును 90 మీటర్ల వెడల్పునకే పరిమితం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మిగిలిన 10 మీటర్ల వెడల్పు భాగానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది. అప్పుడు ఆ పది మీటర్ల వెడల్పు భాగానికి పూర్తి భూసేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. దీంతో దీన్ని తీసుకోవాలా వద్దా అని తటపటాయిస్తున్న తరుణంలో, రింగు రైలు భూసేకరణ అంశం తెరమీదకు వచ్చింది. రింగురైలుకు అవసరమైన 35 మీటర్లు/ 40 మీటర్ల వెడల్పుతో ఉండే అలైన్మెంట్ భూసేకరణ వ్యయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రైల్వే శాఖ పేర్కొంటోంది. అలా కాదు, మొత్తం భూసేకరణ వ్యయాన్ని రైల్వేనే భరించాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నెలాఖరుకు డీపీఆర్ సిద్ధమవుతున్నందున, దీనిపై ఓ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే మధ్య పేచీకి కారణమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
‘రింగు’కు ఆనుకునా.. దూరంగానా..
రీజినల్ రింగురోడ్డును ఆనుకునే రింగు రైలు ప్రాజెక్టుకు భూసేకరణ చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం–ఎన్హెచ్ఏఐ–రైల్వే సంయుక్త సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ, ఇప్పుడు దానిమీద మళ్లీ పునరాలోచించాలని భావిస్తున్నారు. రింగురోడ్డు మలుపులు–రైల్వే లైను మలుపులు–గ్రేడియంట్లో చాలా తేడా ఉంటుంది. రైల్వేలైన్ క్రాసింగ్ రెండు కి.మీ. ముందునుంచే మొదలవుతుంది. దీంతో రోడ్డు–రైలు లైను మధ్య సమన్వయం సాధ్యం కాదు. సాంకేతికంగా సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో దూరదూరంగానే నిర్మించాల్సి ఉంటుందన్న నిపుణుల సూచన మేరకు అలైన్మెంట్లో మార్పుచేర్పుల అంశాన్ని పరిశీలిస్తున్నారు. పక్కపక్కనే నిర్మించినా, దూరంగా నిర్మించినా, భూసేకరణ అనేది పెద్ద సవాల్గా మారనుంది.
ఇప్పటికే రింగురోడ్డుకు భూములు ఇచ్చిన రైతులు మళ్లీ రింగురైలుకు భూములు ఇచ్చేందుకు ససేమిరా అనే అవకాశమే ఎక్కువగా ఉంది. యాదాద్రి తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారి విస్తరణకు, ఇతర సాగునీటి ప్రాజెక్టు కాలువలకు ఇప్పటికే రెండుమూడు పర్యాయాలు భూములు ఇచ్చిన రైతులు, రీజినల్ రింగురోడ్డుకు ఇచ్చేందుకు ససేమిరా అని కోర్టుల్లో కేసులు వేశారు. ఆయా ప్రాంతాల్లో మళ్లీ రింగురైలుకు భూములు ఇచ్చేందుకు వారు సహకరించే వీలు లేదు. ఇటు రోడ్డు–అటు రైల్వే లైను మధ్యలో ఉండే భూములకు విలువ తగ్గిపోతుంది. దీన్ని కూడా ఆయా రైతులు వ్యతిరేకించే అవకాశముంది. వెరసి ఈ ప్రాజెక్టు విషయంలో తీవ్ర అయోమయం నెలకొంది.


