చేయి దాటితే వేటే.. | Rahul Gandhi Mallikarjun Kharge On Telangana Congress Leaders | Sakshi
Sakshi News home page

చేయి దాటితే వేటే..

Jun 28 2023 1:09 AM | Updated on Jun 28 2023 1:09 AM

Rahul Gandhi Mallikarjun Kharge On Telangana Congress Leaders - Sakshi

ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ఖర్గే, ఠాక్రే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన రాష్ట్ర ముఖ్య నాయకులు

సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్‌: ‘‘పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడేందుకు చాలా వేదికలు ఉన్నాయి. మీకు ఎలాంటి సమస్యలున్నా పెద్దల దృ­ష్టికి తీసుకురండి. బయట ఎక్కడా బహిరంగంగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. ఎన్నికలు స­మీ­పిస్తున్న తరుణంలో రచ్చ చేసుకోవద్దు. పార్టీ గీత దాటొద్దు. చర్యలు తీసుకునేలా మాకు అవకా­శం కల్పించొద్దు. కర్ణాటక ఎన్నికల సమయంలో ఇ­దే విషయాన్ని చెప్పాం. వారంతా తప్పకుండా పా­టించి విజయం సాధించారు.

మీరు కూడా అది స్ఫూర్తిగా తీసుకుని పనిచేయండి’’ అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. అంతర్గత విభేదాలతో పార్టీని రచ్చకెక్కిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక తెలంగాణలో ఎన్నికలకు ముందుగానీ, తర్వాతగానీ బీఆర్‌ఎస్‌­తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష కూటమిలోనూ బీఆర్‌ఎస్‌­ను భాగస్వామిని చేయలేదన్న విషయాన్ని వివరించారు. 

కీలక అంశాలపై మార్గనిర్దేశం 
మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన వ్యూహాత్మక భేటీలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు అధిష్టానం పెద్దలు కీలక అంశాలపై మార్గనిర్దేశం చేశారు. రెండున్నర గంటలపాటు జరి­గి­న ఈ భేటీలో నేతల ఐక్యత, మేనిఫెస్టో అంశాలు, ముందస్తు అభ్యర్థుల ప్రకటన, సంప్రదాయక ఓటర్లను తిరిగి ఆకర్షించడం, ఇంటింటికీ కాంగ్రెస్, ప్రభుత్వ అవినీతిపై పోరు వంటి అంశాలపై 120 రోజుల పాటు చేపట్టాల్సిన ఎన్నికల కార్యాచరణపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలపై రాష్ట్ర నేతలు తమ అభిప్రాయాలను అధిష్టానం పెద్దలకు వెల్లడించారు. 

మీడియాకు ఎక్కితే కఠినచర్యలు 
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భేటీలో తొలి ప్రా«­దాన్యతగా నేతల మధ్య ఐక్యతపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్‌ ఉమ్మడి కుటుంబం వంటిది. అప్పుడప్పుడు సమస్యలు, భేదాభిప్రాయాలు వస్తాయి. దానికే రచ్చకెక్కడం, మీడియాకు ఎక్కడం మంచి పద్ధతి కాదు. దీనిపై మాకు అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఇకముందు విభేదాలపై ఎవరూ బయట మాట్లాడొద్దు. ఏదైనా నాతో, ఖర్గేతో లేకుంటే కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడండి. అలాకాకుండా మీడియాకు ఎక్కితే కఠిన చర్యలుంటాయి..’’ అని స్పష్టం చేశారు.

నేతలు ఐక్యంగా ఉంటే బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టడం కష్టమేమీ కాదన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల్లో అనుసరించిన విధానాలను, అక్కడి నేతల పనితీరును రాహుల్‌ గాంధీ వివరించారు. పార్టీ నేతలెవరూ అభ్యర్థులను ప్రకటించడానికి వీల్లేదని.. హైకమాండ్‌ ప్రకటించే అభ్యర్థులే ఫైనల్‌ అని, అప్పటివరకు వేచి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

కర్ణాటక తరహాలోనే వీలున్నంత ముందుగా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఎజెండాగా ముందుకు సాగాలని, ఆ దిశలో కసరత్తు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఓబీసీల కులగణన అనేది కాంగ్రెస్‌ పార్టీ విధానమని, ఈ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీసీ వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 

అవినీతిపై పోరు.. మేనిఫెస్టోపై హోరు.. 
భేటీలో పాల్గొన్న చాలామంది నేతలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి అంశాన్ని ప్రస్తావించగా.. ఒక్కో శాఖలో అవినీతిపై బలంగా పోరాటం చేయాలని, వివిధ మీడియాల ద్వారా ఈ అంశాన్ని ప్రజలకు వివరించాలని అధిష్టానం పెద్దలు సూచించారు. దీనితోపాటు పార్టీ మేనిఫెస్టో అంశాలను బహిరంగ సభల ద్వారా ఇప్పటికే వెల్లడించిన దృష్ట్యా.. అవి గడపగడపకూ చేరేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

ఇక ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనపై చర్చజరగగా.. జూలై నెలలోనే 60 మందికిపైగా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా అధిష్టాన పెద్దలు వెల్లడించినట్టు సమాచారం. సర్వేల ఆధారంగానే ఈ టికెట్ల పంపిణీ ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. మరోవైపు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ, మాజీ ఎంపీ పొంగులేటి చేరిక సభ ఒక్కటిగానే జూలై 2న నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. 

భేటీ అంశాలపై నేతల మౌనం 
అధిష్టానం పెద్దలతో భేటీ అంశాలపై బహిరంగంగా మాట్లాడేందుకు రాష్ట్ర నేతలెవరూ ముందుకు రాలేదు. మీడియాకు ఎక్కొద్దన్న రాహుల్‌ సూచన నేపథ్యంలో చాలామంది నేతలు భేటీ ముగియగానే ఏఐసీసీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఠాక్రే, రేవంత్‌ సహా కొందరు నేతలే మీడియా సెంటర్‌లో మాట్లాడి భేటీ వివరాలు వెల్లడించారు. భేటీ అనంతరం రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేస్తూ ‘తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుంటున్నారు.

త్వరలోనే ప్రగతిశీల నాయకత్వానికి బాటలు వేస్తారు’ అని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌థాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్‌ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, రేణుకాచౌదరి, బలరాం నాయక్, వీహెచ్, మహేశ్‌కుమార్‌గౌడ్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు తదితరులు పాల్గొన్నారు. 

బీఆర్‌ఎస్‌తో ముఖాముఖి పోరు.. 
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో ముఖాముఖి పోరు ఉంటుందని, కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పోరాడాలని అధిష్టానం పెద్దలు రాష్ట్ర నేతలకు మరోసారి స్పష్టత ఇచ్చారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ దగ్గరైందని, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత అరెస్టు కాకుండా సయోధ్య కుదిరిందని.. కేంద్ర మంత్రులతో మంత్రి కేటీఆర్‌ వరుస భేటీలు అందుకేనని, ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

‘‘బీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని ఖర్గే, రాహుల్‌ స్పష్టంగా చెప్పారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష కూటమిలోనూ బీఆర్‌ఎస్‌ను భాగస్వామ్యం చేయబోమన్నారు. ‘త్యాగం కాంగ్రెస్‌ది, భోగం బీఆర్‌ఎస్‌ది’ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పొత్తుల విషయంలో బీఆర్‌ఎస్‌ కానీ, బీజేపీ కానీ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు వివరించాలన్నారు..’’ అని భేటీ అనంతరం టీపీసీసీ నేతలు వెల్లడించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement