జల్లికట్టు ఉద్యమం చూపిన పాఠం మరవొద్దు: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి | Governments Must Address Youth Issues Responsibly Kethireddy | Sakshi
Sakshi News home page

జల్లికట్టు ఉద్యమం చూపిన పాఠం మరవొద్దు: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

Jun 7 2026 11:58 AM | Updated on Jun 7 2026 1:21 PM

Governments Must Address Youth Issues Responsibly Kethireddy

దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత బాధ్యతతో పరిశీలించి, సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.

నేటి భారతదేశంలో లక్షలాది మంది యువకులు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ తగిన ఉద్యోగ అవకాశాలు లేక నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ఉద్యోగ నియామకాలపై అనిశ్చితి వంటి అంశాలు యువతలో ఆందోళనను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ప్రభుత్వాలు కేవలం పరిపాలనా అంశాలుగానే కాకుండా సామాజిక సమస్యలుగా కూడా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

చరిత్రను పరిశీలిస్తే ప్రజల హృదయాల్లో పుట్టిన ఉద్యమాలను ఏ శక్తీ అడ్డుకోలేదని ఆయన గుర్తు చేశారు. 2017లో చెన్నైలోని మేరినా బీచ్ వేదికగా జరిగిన జల్లికట్టు ఉద్యమం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రారంభంలో కొద్దిమంది యువకులు, విద్యార్థులతో మొదలైన ఆ ఉద్యమం క్రమంగా లక్షలాది మంది ప్రజల మద్దతు పొందిందన్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకే లక్ష్యంతో ఐక్యమై ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు.

జల్లికట్టు ఉద్యమం రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కాకుండా ప్రజల ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజా ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ప్రజల సంకల్పం ఎంత బలంగా ఉంటుందో ఆ ఉద్యమం దేశానికి చూపించిందని వ్యాఖ్యానించారు. ప్రజల భావోద్వేగాలను గౌరవించిన ప్రభుత్వాలు చట్టసవరణలు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు.

యువతలో నిరాశ, నిరుత్సాహం పెరిగినప్పుడు వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి రెండు ప్రజాస్వామ్య మార్గాలను ఎంచుకుంటారని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఒకటి శాంతియుత ప్రజా ఉద్యమాలు కాగా, మరొకటి బ్యాలెట్ ద్వారా తమ ఆకాంక్షలను వ్యక్తపరచడం అని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్‌పై ఉన్న అనిశ్చితి కారణంగా యువతలో అసంతృప్తి పెరిగిందని, అది రాజకీయ వ్యవస్థలో మార్పు కోరే భావనగా కూడా వ్యక్తమవుతోందన్నారు.

జల్లికట్టు వంటి ప్రజా ఉద్యమాలు ఒకవైపు కనిపిస్తుండగా, ఎన్నికల రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయాలను పరిశీలించే ధోరణి కూడా కనిపించిందన్నారు. దీనికి తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం పార్టీ సాధించిన అనూహ్య ప్రజాదరణ ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిణామాలు సహజమని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా యువతలో అభద్రతాభావం పెరగడానికి విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షల నిర్వహణ వంటి అనేక కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ అంశాలపై యువతలో చర్చలు, ఆందోళనలు పెరుగుతున్నాయని, వాటిని పాలకులు సకాలంలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువత ఆవేదనను నిర్లక్ష్యం చేయడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు పరిష్కారం సంభాషణ, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన ద్వారానే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా ఉద్యమాలు పుట్టుకురావడానికి కారణమయ్యే పరిస్థితులను ముందుగానే గుర్తించి నివారించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. అలా జరగని పక్షంలో ప్రజా ఉద్యమాలు అనివార్యమవుతాయని పేర్కొన్నారు.

ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని, వారి సమస్యలను సకాలంలో పరిష్కరించే ప్రభుత్వాలే చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. యువత శక్తిని తక్కువ అంచనా వేయరాదని సూచిస్తూ, యువత కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో, శాంతియుత మార్గాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని కోరారు. ప్రభుత్వాలకు హెచ్చరికలు ఇవ్వడం కంటే శాంతియుత మార్గాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement