సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో త్వరలోనే విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) అధికార పీఠాన్ని అధిరోహిస్తుందని ఆ పార్టీ అధినేత ,ఎంపీ తిరుమావళవన్ ధీమా వ్యక్తం చేశారు. కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్పేటలో సోమవారంరాత్రి వీసీకే ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తమిళ జాతీయ పునరుజ్జీవన మహాసభ’ లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తిరుమావళవన్ చేసిన కీలక వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పందిస్తూ తిరుమావళవన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మన పార్టీ ప్రస్తుతం గుర్తింపు పొందిన రాజకీయ శక్తిగా అవతరించింది. రాబోయే రోజుల్లో తమిళనాడులో వీసీకే పాలకపక్షంగా ఎదగాలి. ఇప్పటివరకూ మనం డీఎంకే, అన్నాడీఎంకే , కాంగ్రెస్ వంటి అధికారంలో ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాం. ప్రస్తుతం ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నాయకత్వంలోనిటీవీకే తో కలిసి ప్రయాణిస్తున్నాం. వీసీకే, టీవీకేలు ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో కలిసికట్టుగా ముందుకు సాగుతాయి. భవిష్యత్తులో వీసీకే కూడా పాలకపక్షంగా రూపాంతరం చెందుతుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. మహాసభకు లక్షలాది మంది కార్యకర్తలు తరలిరావడంతో ట్రాఫిక్, భద్రతా కారణ దృష్ట్యా తిరుమావళవన్ తన ప్రసంగాన్ని కుదించుకున్నారు. ‘సభకు విచ్చేసిన వీసీకే శ్రేణులందరూ ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కోరుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే, డీఎంకేలు కలిసి వీసీకే నేత తిరుమావళవన్ను సీఎం చేయడానికి వ్యూహ రచన చేసినట్టుగా ప్రచారాలు సాగాయి. అలాగే, టీవీకే ప్రభుత్వంలో తిరుమాకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వవచ్చుఅన్న చర్చ గత కొంత కాలంగా సాగుతూ వస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో వీసీకే పాలక పక్షం కానున్నట్టు తిరుమా ప్రకటించడం ప్రాధాన్యతకు దారి తీసినట్టైంది. దీనిపై రాజకీయ వర్గాలలో చర్చ ఊపందుకుంది. కాగా, తిరుమావళవన్ బర్తడే సందర్భంగా సీఎం విజయ్ సైతం ప్రత్యేక సందేశంలో అభినందనలు, ప్రశంసలు, పొగడ్తలు కురిపించడం గమనార్హం.


