తిరువళ్లూరు: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్లపై జరుగుతున్న దాడులను నివారించాలని లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని తమిళనాడు సర్వేయర్ల యూనియన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నాకుభేరన్ ప్రకటించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరిలో సంఘం శిలాపలకం ప్రారంభంతో పాటు సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అద్యక్షుడు ఆర్ఎం సెంథిల్కుమరన్ అద్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ, ప్రధాన కార్యదర్శి అన్నాకుభేరన్ తదితరులు హాజరయ్యారు. మొదట సంఘం జెండాను ప్రధాన కార్యదర్శి అన్నాకుభేరన్ ఎగరవేయడంతో పాటూ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం అన్నాకుభేరన్ మాట్లాడుతూ ఇటీవల సర్వేయర్లపై దాడులు పెరుగుతూవుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను సీరియస్గా తీసుకుని దాడులను నివారించాలని ఆయన పిలుపు నిచ్చారు. దాడులను నివారించని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని సైతం హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు విద్య, జాయింట్ సెకరెట్రి శరత్కుమార్, జిల్లా కోశాధికారి నారాయణన్, రాష్ట్ర కార్యదర్శి బేబి, సెంగల్పట్టు జిల్లా అధ్యక్షుడు లోకనాథన్ తదితరులు హాజరయ్యారు.


