– అందరి నుంచి సమానంగా కొనుగోళ్లు
సాక్షి, చైన్నె : తమిళనాడు ప్రభుత్వం మద్యం కొనుగోలు విధానంలో కీలక మార్పులు శ్రీకారం చుట్టింది. ఇకపై రాష్ట్రంలోని మద్యం తయారీదారులందరి నుంచి సమాన ప్రాతిపదికన మద్యం కొనుగోలు చేయాలని టాస్మాక్ – తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. తమిళనాడులోని టాస్మాక్ దుకాణాలు, పబ్లు , బార్లకు సరఫరా చేయడానికి టాస్మాక్ యాజమాన్యం మద్యం తయారీదారుల నుండి రకరకాల బ్రాండ్లను కొనుగోలు చేస్తుంది. గతంలో కేవలం కొద్దిమంది మద్యం తయారీదారులకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు ప్రతి బ్రాండ్ 3 నెలల సగటు విక్రయాలు, అలాగే అంతకుముందు వారం జరిగిన అమ్మకాలను పోల్చి చూసి కొనుగోలు ఆర్డర్లు ఇచ్చేవారు. అయితే ఈ విధానం ఏకపక్షంగా ఉందంటూ పలువురు తయారీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారుల కొత్త నిర్ణయం
ప్రస్తుతం టాస్మాక్కు 17 మద్యం తయారీ సంస్థల నుండి సరఫరా అవుతోంది. ప్రైవేట్ , స్థానిక తయారీ దారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా మద్యం కొనుగోలు ఆర్డర్లను అందరికీ సమాన నిష్పత్తిలో ఇవ్వాలని నిర్ణయించారు. దీనివలన వినియోగదారులకు కూడా విభిన్న రకాల బ్రాండ్లను ఎంచుకునే అవకాశం లభిస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మద్యం కార్మిక సంఘాలు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అన్ని కంపెనీల నుంచి సమాన స్థాయిలో మద్యం కొనుగోలు చేస్తే, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే నిర్దిష్ట బ్రాండ్లు మార్కెట్లో కొరత ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. వినియోగదారుల డిమాండ్ను పరిగణనలోకి తీసుకోకుండా అందరి నుంచి సమానంగా కొనుగోలు చేయడం వలన పరోక్షంగా కొన్ని నిర్దిష్ట కంపెనీల ఉత్పత్తులను పెంచేందుకే ఇది తోడ్పడుతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానించారు.


