● కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
సాక్షి, చైన్నె: రహదారుల అభివృద్ధిపై టీవీకే ప్రభుత్వం మరింతగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా చైన్నె నుంచి సముద్ర తీరం వెంబడి పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం , శీర్గాలి, నాగపట్నం, తిరుత్తురై పూండి, తరంగం బాడి, కారైక్కాల్, నాగూర్, నాగపట్నం, తిరుత్తురై పూండి, ముత్తు పేట, అదిరాంపట్నం, మనల్మేల్కుడి, రామనాథంపురం, తూత్తుకుడి, తిరుచెందూరు, కూడంకుళం మీదుగా కన్యాకుమారికి 777 కి.మీ దూరం కొన్ని చోట్ల ఫోర్వే, మరికొన్ని చోట్ల 2 వే అన్నట్టుగా రోడ్డు మార్గం ఉంది. ఇప్పటికే చైన్నె నుండి నాగపట్టణం వరకు ఉన్న 320 కిలోమీటర్ల మార్గాన్ని అధికారులు విస్తరించారు. అలాగే, మారక్కానం నుండి పుదుచ్చేరి వరకు 46 కిలోమీటర్ల దూరం గల 4–లేన్ల జాతీయ రహదారిని సుమారు రూ.2,137 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే పనులు ప్రస్తుతం పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పుదుచ్చేరిని కలుపుతూ 34.7 కిలోమీటర్ల పొడవైన గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కూడా జరుగుతోంది. ఎన్నూర్ నుండి మహాబలిపురం, శ్రీపెరంబదూరు, తిరువళ్లూరు, తచ్చూర్ , కాట్టుపల్లి వంటి ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ సాగే 133 కిలోమీటర్ల పొడవైన చైన్నె ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వచ్చే ఏడాది నాటికి పూర్తి కానుంది. దీని ద్వారా పశ్చిమ, దక్షిణ జిల్లాల నుండి వచ్చే భారీ వాహనాలు, కంటైనర్లు నగరంలోకి రాకుండా నేరుగా ఓడరేవుకు, మహాబలిపురానికి చాలా త్వరగా చేరుకోగలవు.
కేంద్రానికి ప్రతిపాదనలు
తమిళనాడులో ప్రస్తుతం వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని, అయితే అందుకు తగ్గట్టుగా 6 లేదా 7 లేన్ల రహదారులు సరిపడా లేవని రాష్ట్ర హైవేల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రయాణ సమయం వృధా కాకుండా నివారించడానికి చైన్నె – కన్యాకుమారి మధ్య 8 లేన్ల రహదారి ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని, జాతీయ రహదారుల అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాధనలను ఢిల్లీకి పంపించి ఉన్నారు.
నాణ్యతా ప్రమాణాలు – భూసేకరణ
భారీ పారిశ్రామిక వాహనాల రాకపోకల వలన రోడ్లు దెబ్బతినకుండా ఉండేందుకు, అత్యంత నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్లను నిర్మించేందుకు కొత్త నిబంధనలను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ పనులను జాతీయ రహదారుల అథారిటీ వేగవంతం చేయాలని, రాష్ట్ర రహదారుల వెంబడి చిన్న అనుసంధాన రహదారుల (స్పర్ రోడ్లు) నిర్మాణంలో రాష్ట్ర హైవేల శాఖ పూర్తి సహకారం రాష్ట్రం అందిస్తుందని స్పష్టం చేశారు.


