సాక్షి, చైన్నె : తనపై ఆధార రహిత ఆరోపణలతో అంభాండాలు వేస్తే చట్ట పరంగా చర్యలు తప్పదని దేవాదాయ శాఖామంత్రి రమేష్ హెచ్చరించారు. సోషల్ మీడియాలతో తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలపై పోలీసులకు సైతం మంత్రి తరపున ఫిర్యాదు చేశారు. దిండుగల్ జిల్లా పళని దండాయుధపాణి ఆలయానికి చెందిన రూ. 100 కోట్ల విలువైన 1.40 ఎకరాల భూమిని భక్తుల కోసం ఉచిత పార్కింగ్ స్థలంగా ఉపయోగిస్తున్నారు. పళని రిజిస్ట్రార్ జస్టిన్ మణికంఠన్ ఈ భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్చేయడం వివాదానికి దారి తీసింది. ఆ భూమితో ఎటువంటి సంబంధం లేని ఒక ట్రస్ట్ ద్వారా, వెల్లదురై, సేతుపతిలు కొనుగోలు చేసినట్టు దస్తావేజును జారీ చేశారు. దీనిని పసిగట్టిన ఆలయ సూపరింటెండెంట్ మురుగనందం పళని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రార్ జస్టిన్ మణికంఠన్, ట్రస్ట్ అడ్మినిస్ట్రేటర్ మురుగదాస్, భూస్వామి వైల్లెదురై, సేతుపతి అనే నలుగురిపై కేసు నమోదు చేశారు. రిజిస్ట్రార్ జస్టిన్ మణికంఠన్ను రిజిస్ట్రేషన్ల శాఖ సస్పెండ్ చేసింది. ఈ పరిస్థితులలో ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్టుగా పేర్కొంటున్న వారంతా దేవాదాయ శాఖ మంత్రి రమేష్కు కావాల్సిన వారుగా ఆరోపణలు బయలు దేరాయి. ఇది కాస్త సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీంతో రమేష్ మంగళవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు సోషల్ మీడియా పేజీలలో, కొన్ని యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని ధ్వజమెత్తారు . చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈమేరకు ఆయన తరపు ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్టాలిన్ ఆనందం!
సాక్షి, చైన్నె : మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ లండన్లో డిగ్రీ పూర్తి చేసిన తన మనవడు ఇన్బనిధిని స్వయంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మనవడిని ఆయన ప్రేమతో ఆలింగనం చేసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి. తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కుమారుడైన ఇన్బనిధి లండన్లోని ప్రసిద్ధ మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో క్రీడాభివృద్ధి విభాగంలో తన డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశారు. అక్కడ జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎం.కె. స్టాలిన్ ఈనెల మొదటి వారంలో లండన్కు బయలుదేరి వెళ్లారు. అలాగే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 11వ తేదీన లండన్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన వేడుకలో ఇన్బనిధి తన డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఈ గర్వకారణమైన క్షణంలో అక్కడే ఉన్న తాత ఎం.కె. స్టాలిన్ , తండ్రి ఉదయనిధి స్టాలిన్ భావోద్వేగానికి గురై, ఇన్బనిధిని ఆలింగనం చేసుకుని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. లాగా లండన్ పర్యటన ముగించుకుని ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 18వ తేదీన తిరిగి చైన్నెకి చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


