సాక్షి, చైన్నె : తమిళగ వెట్రి కళగం పార్టీ సభ్యులు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల ప్రాంగణాల్లోకి అనవసరంగా ప్రవేశిస్తే వారిని పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి ఎన్. ఆనంద్ తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల తమిళనాడులోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు చేస్తున్నామనే పేరుతో కొంతమంది టీవీకే కార్యకర్తలు లోపలికి ప్రవేశించి, రీల్స్ వీడియోలు చిత్రీకరించడం వివాదానికి దారితీసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు రాజకీయ పార్టీలు టీవీకే వైఖరిని తీవ్రంగా విమర్శించాయి. ప్రభుత్వ విభాగాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై విమర్శలు వచ్చాయి.
కీలక ఉత్తర్వులు..
ఈ వివాదంపై స్పందించిన పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి ఎన్. ఆనంద్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ అధికారులు ఏ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా, నిజాయితీగా పని చేయాలని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ఈ పరిస్థితిలో, పార్టీకి, సీఎం విజయ్కు అపఖ్యాతి తెచ్చేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్నారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వెనుకాడమన్నారు. టీవీకే సభ్యులు ఎవరూ కూడా అనవసరంగా పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలకు వెళ్లకూడదన్నారు. ఈ నిబంధనను ఉల్లంఘించి విద్యాసంస్థల్లోకి ప్రవేశించే వారిని తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరిస్తామని ఎన్. ఆనంద్ హెచ్చరించారు.


