భారీ విజయం తథ్యం
ప్రజల్ని పలకరిస్తూ ముందుకెళ్తున్న స్టాలిన్
సాక్షి, చైన్నె : సీఎం స్టాలిన్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన నగరాలలో ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని పలకరించడం జరుగుతున్నది. ఈ పరిస్థితులో శనివారం పుదుక్కోట్టైలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం స్టాలిన్ ఇలుప్పూర్ ప్రాంతంలో ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు. మార్గమధ్యలో ఓ ప్రైవేట్ బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటించి ఓట్లను అభ్యర్థించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారందర్నీ పలకరిస్తూ ముందుకు సాగారు. కొందరు తమ విజ్ఞప్తులను వినతి పత్రాల రూపంలో స్టాలిన్కు అందజేశారు. సాధారణంగా వాకింగ్ సమయంలో ప్రజలతో మమేకమయ్యే విధంగా ముందుకు సాగా స్టాలిన్ తాజాగా విలేకరులతో మాట్లాడటం, పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
200 కాదు.. 234 స్థానాలు మావే
ఎన్నికల్లో డీఎంకే కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సీఎం ఎం.కె. స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ఇది వరకు 200 స్థానాల్లో గెలుస్తామని తాను చెబుతూ వచ్చానని, అయితే ప్రస్తుతం ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ తమ కూటమి విజయకేతనం ఎగురవేస్తుందన్న నమ్మకం కలిగిందని వ్యాఖ్యలు చేశారు. కూటమిలోని అందరు అభ్యర్థుల గెలుపు అవకాశాలు అద్భుతంగా ఉన్నాయని, ప్రత్యర్థులు ఎంతమంది ఏకమైనా తమ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.
వారిలో ఓటమి భయం పెరిగింది
అన్నాడీఎంకే నేతలు వారి పార్టీని ఢిల్లీకి తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే అధికారులు, ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. ద్రవిడ పార్టీ అయిన అన్నాడీఎంకే ఢిల్లీకి బానిసగా మారడం బాధా కల్గిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల వేళ సీఎస్ సహా అధికారులను మార్చడం వంటి చర్యల గురించి తాము ఆందోళన చెందడం లేదని, తమ వైపు ప్రజలు ఉన్నారని చెప్పారు. సినీ నటుల రాజకీయ ప్రవేశం గురించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. కొందరు నటుల వెనుక వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న యువత త్వరలోనే వాస్తవాలను గ్రహించి మారుతారని ఆశిస్తున్నట్టు పరోక్షంగా విజయ్ ప్రచారంలో జరుగుతున్న ఘటనలపై వ్యాఖ్యలు చేశారు. ఇక, సాయంత్రం పుదుక్కోట్టైలో భారీ బహిరంగ సభలో డీఎంకే అభ్యర్థులు ఎస్.రఘుపతి, మెయ్యనాథన్, ముత్తురాజా, చెల్లపాండియన్, మిత్రపక్షాల అభ్యర్థులకు మద్దతుగా స్టాలిన్ ప్రచారం నిర్వహించనున్నారు. ఓటర్లను ఆకర్షించే ప్రసంగంతో అన్నాడీఎంకే, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


