భార్య కోసం నౌక తరహాలో భారీ ఇల్లు | - | Sakshi
Sakshi News home page

భార్య కోసం నౌక తరహాలో భారీ ఇల్లు

Jun 11 2023 7:02 AM | Updated on Jun 11 2023 7:06 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: తన భార్య కోరికగా ఓ భర్త ఏకంగా నౌక తరహాలో ఇంటిని నిర్మించాడు. సముద్రాన్ని తలపించే నిర్మాణాలతో అచ్చం నౌకలో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగించే విధంగా నిర్మించిన ఈ నివాసం ప్రస్తుతం కడలూరులో హాట్‌ టాపిక్‌గా మారింది. వివరాలు.. ఇటీవల కాలంలో భార్యలను స్మరిస్తూ ఆలయాలు, భర్తల కోసం భార్యల స్మారక మందిరాల నిర్మాణాలు, విగ్రహాల ఏర్పాటు వంటి ఘటనలు తమిళనాట అధికమయ్యాయి. అలాగే తమ తల్లిదండ్రుల కోసం స్మారక మందిరాలను నిర్మించే తనయులూ ఉన్నారు.

రెండు రోజుల క్రితం తిరువారూర్‌ జిల్లా అమ్మయప్పన్‌ గ్రామంలో చైన్నెనకు చెందిన పారిశ్రామిక వేత్త అమరుద్దీన్‌ మరణించిన తన తల్లి జైలానీ బీవీ స్మారకంగా ఓ తాజ్‌ మహల్‌ తరహాలో మందిరాన్ని నిర్మించి అందరినీ విస్మయంలో పడేశాడు. ఈ తాజ్‌మహల్‌ గురించి గత రెండు రోజులుగా పెద్ద చర్చే జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కడలూరులో జీవించి ఉన్న తన భార్య కోరికను తీర్చే విధంగా షిప్‌లో పనిచేసే ఉద్యోగి ఒకరు నౌక తరహా నిర్మాణాలతో ఇంటిని నిర్మించడం విశేషం.

నౌక తరహాలో..
కడలూరు జిల్లా వన్నార పాళయానికి చెందిన శుభాష్‌ ఓ షిప్పింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అధిక సమయం ఆయన నౌకలోనే పయనం చేస్తూ వస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వివాహమైన తొలి నాళ్లలో తన భార్య శుభశ్రీని వెంట బెట్టుకుని నౌకలో కొన్ని దేశాలకు వెళ్లాడు. ఈ సమయంలో నౌక తరహాలో ఇంటిని మనం కూడా నిర్మించుకోవాలని భర్తను శుభశ్రీ కోరింది. దీంతో భార్య కోరిక తీర్చేందుకు ఇటీవల వన్నార పాళయంలో 11 వేల చదరపు అడుగు స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఇందులో 4 వేల చదరపు అడుగులలో బ్రహ్మాండ నివాసం నిర్మించాడు. ఇది పూర్తిగా నౌకను తలపించే విధంగా ఉండడం విశేషం. మిగిలిన స్థలంలో ప్రత్యేక నిర్మాణాలతో సముద్రాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు చేశాడు.

నౌకలో ఉండే విధంగానే మెట్లు, గదులు, స్విమ్మింగ్‌ ఫుల్‌, జిమ్‌ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయించాడు. నౌకలో కెప్టెన్‌ కూర్చునే ప్రాంతాన్ని ప్రత్యేక గదిగా తీర్చిదిద్ది, అక్కడి నుంచి కడలూరు పరిసరాలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక బైనాకులర్‌ వంటి ఏర్పాట్లు చేయించుకున్నాడు. రాత్రుల్లో అయితే, సముద్రంలో నౌక పయనిస్తున్న తరహాలో లైటింగ్‌ సెట్టింగ్‌లు వేయించాడు. 90 శాతానికి పైగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఇంట్లోకి శుభాష్‌, శుభశ్రీ దంపతులు శుక్రవారం గృహ ప్రవేశం చేశారు.

ఇంటికి ఎస్‌– 4 నిలయం అని వినూత్నంగా పేరు పెట్టారు. తన ఇంట్లో ఉన్న నలుగురి పేర్లకు ముందుగా ఎస్‌ అక్షరం రావడంతోనే ఈ పేరు పెట్టినట్టు శుభాష్‌ పేర్కొన్నారు. మిగిలిన ఖాళీ స్థలంలో నిర్మాణాలన్నీ పూర్తి కాగానే, ఓ దీవిలో తన ఇల్లు నౌక తరహాలో కనిపిస్తుందని, ఆ దిశగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించాడు. పెళ్‌లైన కొత్తలో కోరిన కోరికను ఇప్పుడు తన భర్త సాకారం చేయడం ఆనందంగా ఉందని శుభశ్రీ తెలిపారు.

1
1/3

కడలూరులో నౌక తరహాలో నిర్మించిన ఇల్లు 2
2/3

కడలూరులో నౌక తరహాలో నిర్మించిన ఇల్లు

3
3/3

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement