కోదాడ : కోదాడ పట్టణంలో మున్సిపల్ కాంప్లెక్స్ కూలే స్థితికి చేరినా దాన్ని పట్టించుకునే నాథులే కరువయ్యారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై 20 దుకాణాలతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్, రామాలయానికి ఎదురుగా, సాయికృష్ణ థియేటర్ బజార్లో మరో 20 దుకాణాలున్నాయి. కోదాడ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో 40 ఏళ్ల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరాయి. దీంతో రెండేళ్ల క్రితమే కూల్చివేయాలని ఇంజనీరింగ్ అధికారులు నివేదిక అందించారు.
నామమాత్రపు అద్దెలు
మున్సిపల్ దుకాణ సముదాయం నిర్మించిన సమయంలో అప్పటి ధరల ప్రకారం రూ.వందల్లోనే అద్దెకు కేటాయించారు. ప్రతి రెండేళ్లకోసారి బహిరంగ వేలం నిర్వహించి దుకాణాలను కేటాయించాల్సి ఉంది. కానీ 40 ఏళ్లలో ఒక్కసారి కూడా దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించలేదు. ప్రతిసారి రెండేళ్లకోసారి లీజుదారులు అధికారులను మచ్చిక చేసుకుంటూ నామమాత్రపు అద్దెపెంపుతో పని కానిస్తున్నారు. కోదాడలో ప్రధాన రహదారిపై దుకాణం అద్దె రూ.25 వేల వరకు ఉండగా.. మున్సిపల్ కాంప్లెక్స్లో మాత్రం రూ.ఐదారు వేలకు మించి లేదు. ఈ దుకాణాలను మొదట దక్కించుకున్నవారు ఇతరలకు సబ్లీజ్కు ఇచ్చి మున్సిపాలిటీకి మాత్రం నామమాత్రపు అద్దె చెల్లిస్తూ వాటిని వదిలి పెట్టడం లేదు.
ఒకటిని రెండుగా విభజించి..
సాయికృష్ణ థియేటర్ బజార్లో ఉన్న దుకాణ సముదాయంలో ఏళ్లుగా బంగారం షాపులు నిర్వహిస్తున్నారు. 30 ఏళ్లుగా బహిరంగవేలం నిర్వహించలేదు. దుకాణాలను దక్కించుకున్న వారు ఒక్కోదాన్ని రెండుగా విభజించి మరొక దానిని ఇతరులకు అద్దెకు ఇచ్చి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ దుకాణ సముదాయంపైన మున్సిపాలిటీ అనుమతి లేకుండానే భారీ సమావేశ మందిరం నిర్మించుకొని వాడుకుంటున్నారు. అయినా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఫ కూలేదశకు చేరిన కోదాడ
మున్సిపల్ కాంప్లెక్స్
ఫ కూల్చి వేయాలని రెండేళ్ల క్రితమే
ఇంజనీరింగ్ అధికారుల నివేదిక
ఫ పట్టించుకోని మున్సిపల్ యంత్రాంగం
ఫ సబ్ లీజుల పేరుతో దందా సాగిస్తున్న కొందరు లీజుదారులు


