సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ నరసింహ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లడారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల వివరాలు, దర్యాప్తులో పురోగతి, కేసుల ఆన్న్లైన్ నమోదు, ఈ–సాక్షి నమోదు, పెండింగ్ కేసుల పరిష్కారం వంటి వాటిపై సమీక్షించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు, సైబర్ మోసాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలు, భక్తులు ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా డీజేలకు అనుమతి లేదని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


