భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో వెబెక్స్ ద్వారా భూ భారతి, ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ రెవెన్యూ సర్వేల నుంచి మొదలుకొని ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం వరకు ప్రతి అంశంలోనూ పారదర్శకత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా చేపడుతున్న గ్రామ సర్వే ప్రక్రియ మరింత సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్ డీఆర్ఓ ప్రేమ్రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పనుల వేగం పెంచాలి
జిల్లాలో మూడు నియోజకవర్గాలలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనుల వేగం పెంచాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీసీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. హుజూర్నగర్ నియోజకవర్గం గడ్డిపల్లి, కోదాడ నియోజక వర్గం చిలుకూరు, తుంగతుర్తి నియోజకవర్గం తొండలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. పనులను సమయానికి, ఇచ్చిన ఆర్కిటెక్చర్ డిజైన్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ భానుప్రసాద్, డీఈఓ అశోక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్కుమార్, ఏఈ ఓబులేష్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
అవగాహన కల్పించాలి
జిల్లాలో అందుబాటులో ఉన్న ఆయుష్ వైద్య సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి తదితర ఆయుష్ వైద్య విధానాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తరించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పి.వెంకటరమణ, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రమేశ్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ మాధవ్కుమార్, ప్రోగ్రాం అధికారులు కోటి రత్నం, నాజియా తబస్సుం, శ్రీశైలం, నాగరాజు, సంజీవ్రెడ్డి, ఉమా మహేశ్వరి, భార్గవ్, అయూష్ వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్


