ఫ జాతీయ జెండాకు ఇక్కడే రూపునిచ్చిన పింగళి వెంకయ్య
నడిగూడెం : నడిగూడెంలోని జమీందారు రాజా బహుద్దూర్ నాయిని వెంకటరంగారావు కోటలోనే స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. పింగళి వెంకయ్య స్వగ్రామం ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు. 1910లో అమెరికాలోని బోస్టన్లో పింగళి వెంకయ్య, రాజా నాయిని వెంకటరంగారావు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత వెంకటరంగారావు అప్పటి మునగాల పరగణాను పాలించారు. పింగళి వెంకయ్యకు వ్యవసాయంరంగంపై ప్రావీణ్యాన్ని గుర్తించిన రాజావారు.. 1921లో ఆయనను తన ఆస్థానంలో వ్యవసాయాధికారిగా నియమించుకున్నారు.
గాంధీజీ సూచనతో.. జాతీయ జెండా
గాంధీ అంటే పింగళి వెంకయ్యకు ఎంతో గౌరవం. ఆయన దక్షిణాఫ్రికాలో చదువుకునే రోజుల్లోనే గాంధీజీతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత రాజావారి వద్ద విధులు నిర్వహిస్తూనే వెంకయ్య స్వాతంత్య్రోద్యమంలో భాగంగా పలుమార్లు గాంధీజీని కలిశారు. మన దేశానికి జాతీయ జెండా ఉండాలని గాంధీజీ సూచన మేరకు 1921లో పింగళి వెంకయ్య నడిగూడెం కోటలోనే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో గాంధీ నూలు వడికే రాట్నం చిత్రంతో జాతీయ జెండాకు తుదిరూపునిచ్చారు.
విజయవాడ సభలో అప్పగింత..
పింగళి వెంకయ్య తాను రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని 1921 మార్చి 21న విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న గాంధీజీకి అందించారు. దేశ నలుమూలల నుంచి 16 నమూనాలు గాంధీజీకి చేరినప్పటికీ, వెంకయ్య రూపొందించిన జెండాకే ఆయన ఆమోదం తెలిపారు. ఆ తర్వాత కాలంలో రాట్నం స్థానంలో అశోక చక్రం చేర్చి జాతీయ పతాకంగా ఖరారు చేశారు.


