సూర్యాపేటటౌన్ : ప్రజలకు కూరగాయలు, మాంసం, చేపలు ఇలా అన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేందుకు నిర్మించిన సమీకృత మార్కెట్ వృథాగా మారింది. సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్లో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన మార్కెట్ను అధికారికంగా ప్రారంభించినప్పటికీ కూరగాయల వ్యాపారులు రోడ్లపైనే విక్రయాలు సాగిస్తున్నారు. మటన్, ఫిష్ విక్రయ దారులు అసలు మార్కెట్లోకే రాలేదు. ప్రస్తుతం ప్రధాన రహదారిపైనే వాటి విక్రయాలలు సాగుతుండడంతో నిత్యం రద్దీ నెలకొంటుండగా.. తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది.
రూ.19 కోట్లతో నిర్మాణం
కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలు ఒకే చోట ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించారు. మార్కెటింగ్, మున్సిపల్ శాఖల నుంచి సుమారు రూ.19 కోట్ల నిధులు వెచ్చించి పాత వ్యవసాయ మార్కెట్ స్థలంలో మోడల్ మార్కెట్ను నిర్మించారు. ఇందులో వ్యాపారులతో పాటు కొనుగోలు దారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆగస్టు 2023లో అప్పటి మంత్రి జగదీశ్రెడ్డి సమీకృత మార్కెట్ను ప్రారంభించారు. అప్పట్లో అధికారులు హడావిడిగా కొన్ని దుకాణాలను మార్కెట్లోకి తరలించారు. అన్ని దుకాణాలు మార్కెట్లోకి తరలక పోవడం, చాలా మంది వ్యాపారులు రోడ్లపైనే కూరగాయలు, మటన్, ఫిష్తో పాటు ఇతర వస్తువులు విక్రయిస్తుండడంతో లోపల ఉన్న వ్యాపారులు సైతం తమకు గిరాకీ కావడం లేదంటూ బయటకు వచ్చేశారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు సైతం వాటిని పట్టించుకోక పోవడంతో ప్రస్తుతం వృథాగా మారింది.
నిరుపయోగంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్
కొనుగోలు దారులు, వాహనాలతో నిత్యం ట్రాఫిక్ జామ్
ఇబ్బందులు పడుతున్న
స్థానికులు, వాహనదారులు


