సూర్యాపేట : అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని కార్మిక, రైతు సంఘాల నాయకులు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన జైల్ భరో కార్యక్రమం సోమవారం జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు అడుగడుగునా వారిని అడ్డుకుని నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. దాంతో ప్రజా సంఘాల నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారని, అసభ్య పదజాలం ఉపయోగించారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. మహిళా సంఘాల ప్రతినిధులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో వారు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు మండారి డేవిడ్కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంబాలపల్లి శ్రీను మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మేకల శ్రీను, గంట నాగయ్య, మట్టి పెల్లి సైదులు, తదితరులు పాల్గొన్నారు.
పలువురి అరెస్ట్
జైల్ భరో నేపథ్యంలో పోలీసులు ఉదయమే రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డిని అరెస్ట్ చేశారు. జైల్భరో కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన నిర్వహిస్తున్న నాయకులను సైతం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక
సంఘాల నేతలు


