సూర్యాపేట టౌన్ : సూర్యాపేట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా రాకపోవడంతో ప్రజలు ఇళ్లలోని చెత్త, ఇతర వ్యర్థాలు వీధుల పక్క, ఖాళీ స్థలాల్లో పడేస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో చెత్తకుప్పలు దర్శనమిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ప్రస్తుతం సీజన్ వ్యాధుల ప్రబలే సమయంలో కావడంతో ప్రజారోగ్యానికి ముప్పుపొంచి ఉందని పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెత్త సేకరణ రోజూ జరగట్లే..
మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 48 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో చెత్త సేకరణ వాహనాలు ప్రతిరోజూ రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకసారి చెత్త పేరుకుపోయిన తర్వాత రోజులు గడిచినా మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. దీంతో మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఐదారు వార్డుల్లో చెత్త సమస్య తీవ్రంగా, మరికొన్ని వార్డుల్లో స్వల్పంగా ఉంది. వార్డుల్లో చెత్త సేకరించే వాహనాలు సరిపడా లేకపోవడంతో వారానికోసారి మాత్రమే వస్తున్నాయి. వారం రోజులైనా వాహనాలు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధి చివరన చెత్తను పారవేయాల్సి వస్తోంది.
పందులకు అడ్డాలుగా.. దోమల స్వైరవిహారం
రోడ్లపై పేరుకుపోతున్న చెత్తకుప్పలు పందులకు ఆవాసాలుగా మారుతున్నాయి. మరోవైపు వర్షపు నీరు, వ్యర్థాలు ఒకేచోట నిల్వ ఉంటుండడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పరిసర ప్రాంతాల ప్రజలు అంటున్నారు.
వర్షాకాలం.. భయం భయం
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ చెత్త సేకరించాలని విజ్ఞప్తి
మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, అన్ని వార్డుల్లో ప్రతిరోజూ చెత్త సేకరణ వాహనాలు తిరిగేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చెత్తకుప్పలుగా ‘పేట’ కాలనీలు
ఫ రోజూ రాని చెత్త సేకరణ వాహనాలు
ఫ మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం
ఫ పొంచి ఉన్న సీజన్ వ్యాధుల ముప్పు
ఈ ఫొటోలో కనిపిస్తున్న చెత్తకుప్ప
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే రోడ్డులోఉంది. ఇక్కడ కొన్ని రోజులుగా చెత్తకుప్ప ఇలానే దర్శనమిస్తోంది.
రోజు చెత్త ఎత్తకపోవడంతో పేరుకుపోయి కాలనీ వాసులు, గుడికి వెళ్లే వారు ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు. వారానికి ఒకసారి మాత్రమే
చెత్త తొలగిస్తున్నారని కాలనీ వాసులు చెబుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో చాలా చోట్ల ఇలానే
చెత్తకుప్పలు దర్శనమిస్తుండడం గమనార్హం.


