పెన్పహాడ్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్లకు పీఆర్సీ అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్కుమార్ అన్నారు. బుధవారం పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్తోపాటు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో పెండింగ్ డీఏలన్నీ ఇస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించిందన్నారు. జీవో 25ను సవరించి ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, నాన్ టీచింగ్ స్టాఫ్ను నియమించాలని, రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం సర్వీస్ నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారులైన మండల విద్యాధికారుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు యం. వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఎస్.లింగయ్య, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు సీహెచ్.గోవింద్, మండల కోశాధికారి జి.రాంబాబు, సీనియర్ నాయకులు ఎ.వెంకటేశ్వర్లు, మనోహర్, భిక్షం తదితరులు పాల్గొన్నారు.


