
రాకున్నా.. వచ్చినట్టు
నాగారం : గ్రామ పంచాయతీల్లో పాలన గాడి తప్పుతోంది. కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు రాకున్నా వచ్చినట్లుగా రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్) యాప్లో తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు జూలైలో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదును పరిశీలించారు. ఈ క్రమంలో జిల్లాలో 48 మంది కార్యదర్శులు తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. దీంతో వారికి ఉన్నతాధికారులు చార్జ్మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే కొందరు పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
భవనాలు, కుర్చీల ఫొటోలు అప్లోడ్..
పంచాయతీ కార్యదర్శులు ఉదయం 11 గంటలలోపు గ్రామానికి వెళ్లి యాప్లో తమ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ లోకేషన్కు వచ్చి సెల్ఫీ ఫొటో తీసుకుని డైలీ శానిటేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్) యాప్లో అప్లోడ్ చేయాలి. తదుపరి పారిశుద్ధ్య పనులను చేయిస్తూ ఆ ఫొటోలను కూడా యాప్లో అప్లోడ్ చేయాలి. అదే వారి ముఖ గుర్తింపు హాజరు కూడా. కానీ కొందరు యాప్లో ఉన్న వెసులుబాటును ఆసరాగా చేసుకొని విధులకు గైర్హాజరవుతున్నారు. యాప్లో సెల్పీతోపాటు ఏ ఫొటో అప్లోడ్ చేసినా ఓకే అని చూపిస్తుండడం వారికి కలిసి వస్తోంది. పంచాయతీ కార్మికుల సెల్ఫోన్లలో ఈ యాప్ను కొందరు పంచాయతీ కార్యదర్శులు ఇన్స్టాల్ చేస్తున్నారు. కార్మికులే తమ ఫోన్లలో డీఎస్ఆర్ యాప్ ఓపెన్చేసి కార్యదర్శి హాజరును నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పంచాయతీ భవనాలు, కుర్చీలు, ఇతర వస్తువులను అప్లోడ్ చేస్తున్నారు. మరికొందరు సెల్ఫోన్లో ఉన్న కార్యదర్శి సెల్ఫీ ఫొటోను మరోఫోన్ ద్వారా ఫొటో తీసి యాప్లో నమోదు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల పంచాయతీ అధికారులదే. కార్యదర్శుల హాజరు నమోదు ఎంపీఓ లాగిన్లో ఉంటుంది. డీఎల్పీఓ, డీపీఓలు సైతం తనిఖీ చేయవచ్చు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో కార్యదర్శులు తప్పుడు వివరాలను నమోదు చేస్తున్నారు.
ఫ తప్పుడు హాజరు నమోదు చేసిన
పంచాయతీ కార్యదర్శులు
ఫ పంచాయతీ కార్మికుల
సెల్ఫోన్లలో డీఎస్ఆర్ యాప్ ఇన్స్టాల్
ఫ విధులకు రాకుండానే ఫొటోలు అప్లోడ్
ఫ జిల్లాలో 48 మంది కార్యదర్శులకు
నోటీసులు
నోటీసులు జారీ చేశాం
డీఎస్ఆర్ యాప్లో తప్పుడు ఫొటోలు నమోదు చేసిన 48 మంది కార్యదర్శులను గుర్తించి చార్జ్ మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. సెలవు పెట్టకుండానే విధులకు గైర్హాజరయ్యే కార్యదర్శులపై చర్యలు తప్పవు.
–కె.యాదగిరి,
జిల్లా పంచాయతీ అధికారి, సూర్యాపేట

రాకున్నా.. వచ్చినట్టు