
గుట్టకు పవిత్రోత్సవ శోభ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం పవిత్రోత్సవాలకు సిద్ధమైంది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని మామిడి, అరటి తోరణా లతో అలంకరించారు. యాగ నిర్వహణకు ప్రథమ ప్రాకార మండపంలో యాగశాలను సిద్ధం చేశారు.
విశ్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు శ్రీకారం
సోమవారం సాయంత్రం విష్వక్సేన ఆరాధనతో అర్చకులు పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ వేడుకతో పాటు రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో రోజు ఉదయం నవకలశ అభిషేకాలు, నిత్య మూర్తి, మూలమంత్ర, శ్రీనృసింహ, సుదర్శన, దేవతా హవనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి విమాన గోపురానికి పూజలు చేసి, శ్రీసుదర్శన చక్రానికి పవిత్ర మాలలు ధరింపజేస్తారు. చివరిరోజు బుధవారం మహా పూర్ణాహుతి నిర్వహించి, స్వామి వారికి పవిత్రమాలలను సమర్పించడంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
సర్వదోషాలు తొలగిపోవడానికి..
ఏటా శ్రావణమాసంలో స్వామి వారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగే నిత్యారాధనలు, వివిధ రకాల ఉత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగినట్లయితే వాటి ప్రాయశ్చితార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు తెలిపారు.
ఫ నేటి నుంచి మూడు రోజులు ఉత్సవాలు