అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు ద్వారా మొత్తం రూ. 64,63,898 మేరకు ఆదాయం లభించినట్లుగా ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ తెలియజేశారు. సోమవారం ఉదయం అనివెట్టి మండపంలో ఆలయ హుండీల్లో కానుకలను లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. గత లెక్కింపులో చోరీ జరిగిన నేపథ్యంలో ఈసారి కట్టుదిట్టమైన భద్రతాచర్యలు, నిఘా చర్య లతో లెక్కింపును చేపట్టారు. దీంతో నగదు రూపంలో రూ.60,70,701, చిల్లర రూపంలో రూ.3,93, 197 లభించినట్టుగా ప్రకటించారు. అలాగే 23 గ్రాముల బంగారంతో పాటు 1 కేజి 800 గ్రాముల వెండి వస్తువులు మొక్కుబడుల కింద లభించినట్లుగా ప్రకటించారు. వీటితో పాటు విదేశీ కరెన్సీ కూడా లభించిందని ఆయన తెలిపారు.


