శ్రీకాకుళం క్రైమ్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రత్యక్షంగా మరింత చేరువవ్వాలనే ఉద్దేశంతో పోలీసులతో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనిద్వారా వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలవుతుందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దానికి తోడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం జరుపుతున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న నేరాలు, మోసాలు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ కార్యకలాపాలైన గంజాయి, పేకాట, అక్రమ మద్యం తదితర వాటిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా దీనిలో భాగంగా మంగళవారం రాత్రి గార, పొందూరు, టెక్కలి, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురంతో పాటు జిల్లాలోని వివిధ స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది రాత్రి బస చేశారు.


