థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు ఒప్పుకోకపోవడంతో 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బీల ప్రాంతంలో బహుళ ఉత్పత్తుల పరిశ్రమలు నిర్మించుకోవడానికి ఎన్సీసీ యాజమాన్యానికి జీవో నంబర్ 329 విడుదల చేసింది. దీనిని అదునుగా తీసుకుని ఎన్సీసీ యాజమాన్యం 2017 సంవత్సరంలో సవిత్ర అగ్రి ఇండస్ట్రీయల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తాము కొనుగోలు చేసిన భూముల్లో చేపల చెరువుల నిర్మాణం చేపడతామని ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు దరఖాస్తులు చేసింది. అనంతరం అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సహకారంతో 2018 మే నెలలో 182 ఎకరాల్లో చేపల చెరువుల నిర్మాణాకి పెద్దగట్లు వేశారు. పెద్ద గట్లు వేయడం, ఆక్వా చెరువులు ఏర్పాటు చేస్తున్నారనే ఊహగానాలు నేపథ్యంలో రైతులు, అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక ఆధ్యర్యంలో చేపల చెరువుల నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అయితే అనంతరం ఎటువంటి అనుమతులు రాకపోవడంతో చెరువుల నిర్మాణం తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కానీ అప్పట్లో నిర్మించిన గట్లు నేటివరకు తొలగించలేదు. నీటి ప్రవాహానికి అడ్డుగా గట్లు వేయడంతో బారువ, పలాసపురం, బెంకిలి, జింకిభద్ర పంచాయతీల పరిధిలో వేలాది ఎకరాల వరి పొలాలు ప్రతిఏటా అక్టోబర్, సెప్టెంబర్లో కురిసే భారీ వర్షాలకు ముంపునకు గురవుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2018లో జిల్లా కలెక్టర్ గట్లు తొలగిస్తామని హమీలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని స్థానిక రైతులు తెలియజేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి అడ్డంగా వేసిన చెరువు గట్లు తొలగించాలని కోరుతున్నారు.


