శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వల్లరాజు మాట్లాడుతూ.. డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చదువుకున్న విద్యార్థులకు దాదాపు పదివేల 700 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటనలు పేపర్లకే పరిమితమవుతున్నాయని తెలిపారు. చాలా వసతి గృహాల్లో తాగడానికి శుద్ధమైన జలం అందడం లేదని, ధరలు ఆకాశం అంటుతుంటే విద్యార్థులకు ఇచ్చే మెస్ ఛార్జీలు మాత్రం అంతంత మాత్రమేనని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. కార్పొరేట్ల విద్యాశాఖ మంత్రి మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.సోమశేఖర్, సీహెచ్ రవి జిల్లా నాయకులు చరణ్ తేజ అశోక్ హర్షవర్ధన్ ఉదయ్ సాయి భవాని తదితరులు పాల్గొన్నారు.


