ఆమదాలవలస: సంతబొమ్మాళి మండలానికి చెందిన మహిళా రైతు కాంతమ్మ మరణం ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ఫలితంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో యూరియా బస్తాల కోసం రైతులు రోడ్డుపై గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఓటీపీలు, యాప్లు, రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రైతులను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. రైతుల ప్రాణాలతో చెలగాటమాడడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగదన్నారు. యూరియా, విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కడం చూస్తుంటే బాధాకరంగా ఉందన్నారు. గత వైఎస్సార్సీసీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రైతు భరోసా కేంద్రాలు, ఉచిత పంట బీమా, రైతు భరోసా వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచారన్నారు. పార్టీ రాష్ట్ర పంచాయితీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి శ్రీనివాసరావు, జిల్లా ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షుడు కొప్పల ఈశ్వరరావు, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు వీరగట్టపు కృష్ణారావు, నియోజకవర్గ మున్సిపల్ విభాగం అధ్యక్షుడు పొదిలాపు తిరుపతిరావు, నాయకులు అన్నెపు కృష్ణ, పైల చిన్నారావు, అన్నెపు సంజయ్, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయశాఖ మంత్రి ఇలాకాలో యూరియా కోసం మహిళా రైతు మరణం సిగ్గుచేటు
వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్


