మందస: మందసలో చారిత్రక మండపం, దాని చుట్టూ ప్రత్యేక రాతితో నిర్మించిన కట్టడాన్ని ధ్వంసం చేయడం సరికాదని కళింగ సీమ సాధన కమిటీ నాయకుడు డాక్టర్ దువ్వాడ జీవితేజేశ్వరరావు అన్నారు. ఇటీవల ధ్వంసమైన ఈ ప్రదేశాన్ని ఆదివారం పరిశీలించారు. 2100 ఏళ్ల కిందట ఖారవేలుడి పాలనా కాలంలో జరిగిన ఇటువంటి ప్రాచీన నిర్మాణాలను పరిరక్షించుకోవాలని బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గోపాలసాగర్ అభివృద్ధిలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఓపెన్ జిమ్ నిర్మాణానికి కావలసిన ఖాళీ ప్రదేశం పుష్కలంగా ఉన్నప్పటికీ, ఈ చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేయడం చరిత్రహీనుల లక్షణమన్నారు. ఇక్కడి శివాలయం గోడపై ఉన్న 23వ జైన తీర్థంకరుడైన వృషభనాథుడి విగ్రహం వరకు తవ్వకాలు జరిపారంటే, ఆ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయాలన్న కుట్రకోణం అందులో దాగి ఉందనే అనుమానం వ్యక్తంచేశారు. ప్రాచీన కట్టడాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ మామిడి కోదండరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ప్రాచీన కట్టడాలను కాపాడాలని, ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిన్ని తిరుపతి రెడ్డి, కంచి బెహరా, పట్నాయక్, కురేష్, నిరంజన్, సంతోష్, చిన్నరెడ్డి, మల్లారెడ్డి, హేమరాజు, గొంగా బెహరా, బాసుదేవ, హేమంత్, గంట గోపి, గణపతి బెహరా పాల్గొన్నారు


