సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోయినప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని..వెంటనే పెండింగ్ పరిహారం ఇప్పించాలని బాధిత రైతు జీరు ధర్మారావు దంపతులు కోరారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ తనకున్న ఎకరా 73 సెంట్ల భూమిని పోర్టు నిర్మాణానికి ఇవ్వగా అందులో 80 సెంట్లకు మాత్రమే రూ.21 లక్షల 50 వేలు పరిహారం ఇచ్చారని తెలిపారు. మిగిలిన పరిహారం ఇవ్వకుండా ఏళ్లు తరబడి తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరగడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోర్టు నిర్మాణానికి తనతో పాటు మరో 31 మంది రైతులు భూములు ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టుకు భూములు ఇచ్చామని తెలిపారు. దీంతో ఎకరాకి అదనంగా ఇచ్చిన రూ.12 లక్షల 50 వేలు కూడా తమకు ఇవ్వలేదని చెప్పారు. కొబ్బరి, జీడి చెట్లు పరిహారం కూడా ఇవ్వలేదని, ఇదేంటని ప్రశ్నిస్తే పోలీస్ కేసులంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. మరోవైపు, కె.లింగూడు గ్రామంలో సర్వే నంబర్ 164/12,139/6లో మూడు ఎకరాల 51 సెంట్లకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


