పొందూరు: మండల రేషన్ సరుకుల నిల్వల కేంద్రం, రేషన్ డిపోల వద్ద తప్పనిసరిగా సరుకు నిల్వల బోర్డులను ప్రదర్శించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఎంఎల్ఎస్ పాయింట్ను సందర్శించి గోదాంలో సరుకుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ సిలిండర్లను సకాలంలో పంపిణీ చేయడం లేదని, బ్లాక్ మార్కెట్లో మాత్రం అధిక ధరలకు యథేచ్ఛగా దొరుకుతుందంటూ పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో అటుగా వెళ్తున్న గ్యాస్ సిలిండర్ వాహనాన్ని నిలిపి డెలివరీ బాయ్ వద్ద స్లిప్పులను పరిశీలించి డీఎస్వో సూర్యప్రకాశ్తో మాట్లాడారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆహార నాణ్యతను పరిశీలించారు. అలాగే పొందూరులోని పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం కాకుండా రేషన్ బియ్యం సరఫరా చేయడంపై ఆఽశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు తహసీల్దార్ వెంకటేష్, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు, డీటీ తిరుపతిరావు తదితరులు ఉన్నారు.


