యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
రూపురేఖలు కోల్పోతున్న రహదారులు
ప్రమాదాలబారిన వాహనదారులు
పట్టించుకోని అధికారులు,
ప్రజాప్రతినిధులు
ర కిలోమీటరు..
ఆమదాలవలస రూరల్: అర కిలోమీటర్ రహదారిలో సుమారు 62 ప్రమాదాలు ఇటీవల కాలంలో జరగడం అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇసుక మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతుండడంతోనే ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆమదాలవలస రూరల్ మండలంలోని కొత్తవలస నుంచి రాగోలు వరకు సుమారు 10 కి.మీ దూరం ఉంటుంది. దీని మధ్యలో నారిపేట, ఇసుకలపేట, దిబ్బలుపేట గ్రామాలు పక్కపక్కనే అర కిలోమీటర్ పరిధిలో ఉంటాయి. ఈ ప్రాంతంలోనే అధికంగా ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా కారణంగా అధికంగా లారీలు, ట్రాక్టర్లు లోడ్ చేస్తున్నారు. ఆ ఇసుక ఈ ప్రాంతంలో రహదారి మీద పడుతుండడంతో బైక్పై వెళ్లినవారు బోల్తాపడక తప్పడం లేదు. ఇటీవల ఆమదాలవలస రూరల్ మండలం కనుగులువలస గ్రామానికి చెందిన గోల్లపల్లి తవుడు బైక్పై వస్తుండగా బోల్తాపడి తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. అలాగే తొగరాం గ్రామానికి చెందిన ముక్కు రమణమూర్తి, మంతిరెడ్డి కృష్ణ, గురుగుబెల్లి కృష్ణంరాజు, దూసిపేట గ్రామానికి చెందిన బుడుమూరు సాగర్ ఇలా అనేక మంది ఈ అర కిలోమీటర్ పరిధిలోనే ప్రమాదాల బారినపడ్డారు. ఇక ఈ రహదారి పొడవునా చూసుకుంటే వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి.
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
ఆమదాలవలస రూరల్ మండలంలో రోజుకు వందల లారీలు ద్వారా నాగావళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిపోతోంది. పాతూరు, కొత్తవలస, ముద్దాడపేట, పెద్దదూసి తదితర ప్రాంతాల్లో అక్రమ ఇసుక ర్యాంపులు కొనసాగుతున్నాయి. ఒకపక్క రహదారులు రూపురేఖలు కోల్పోతున్నా.. పలు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నా అక్రమ ఇసుక రవాణాకు అడ్డు లేకుండా పోతోంది. చివరకు ప్రజల ప్రాణాలు పోయినా అక్కడ లారీలను ఆపేవారు లేకుండా పోయారు. నేతల అండదండలు ఉండడంతో వారు చెప్పిందే వేదంగా ఇక్కడ కొనసాగుతోంది. దూసిపేట గ్రామం వద్ద ఒకరికి తీవ్రగాయాలై గ్రామస్తులు లారీలను అడ్డుకున్నారు. అయితే నేతల రంగ ప్రవేశంతో గంటల వ్యవధిలోనే లారీలను తరలించడం గమనార్హం.
ప్రాణ భయంతో ప్రయాణాలు
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా వలన కొత్తవలస నుంచి రాగోలు వరకు సుమారు 10 కిలోమీటర్లు పొడవున రహదారి రూపురేఖలు కోల్పోయింది. అలాగే రహదారి పొడవునా ఇసుక జారిపడి ద్విచక్ర వాహనాలు, మిగతా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలబారిన పడుతున్నారు. దీంతో ఈ రహదారిపై ప్రాణభయంతో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బయటకు వెళ్లిన వ్యక్తులు ఎప్పుడు తిరిగి వస్తారోనని కుటుంబ సభ్యులు ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కనీసం రహదారిపై జారిపడిన ఇసుకను పక్కకు తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు. అందువలన ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు.


