రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడిన
దుండగులు
రెండేళ్లుగా భక్తుల నుంచి వచ్చిన
విరాళాలు అపహరణ
వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి ఉమాకామేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలుపడ్డారు. సోమవారం రాత్రి రెక్కీ నిర్వహించిన దొంగలు, అనంతరం రాత్రి 12.05 గంటల తర్వాత చోరీకి పాల్పడ్డారు. స్టీల్ హుండీ తలుపు పగలుగొట్టి రెండేళ్లుగా భక్తుల నుంచి వచ్చిన విరాళాలు సుమారు రూ.60 వేలు, అమ్మవారి విగ్రహానికి వేసిన రూ.2 వేలు విలువ చేసే బంగారం పుస్తెను దోచుకున్నారు. మంగళవారం వేకువజామున ఆలయ అర్చకుడు ఎస్.ధర్మలింగం ఆలయానికి వచ్చేసరికి హుండీ చోరీకి గురైనట్లు గుర్తించి ఆలయ ట్రస్టీలకు తెలిపారు. వారు పరిశీలించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెక్కీ నిర్వహించి చోరీ
పూండి రైల్వేస్టేషన్ సమీపంలోని సంత మెదానం వద్ద శివాలయం ఉంది. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు సోమవారం జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొని రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డారు. రెండేళ్లు నుంచి ఆలయ హుండీని ట్రస్టీలు లెక్కించ లేదు. హుండీలో దాదాపు రూ.60 వేలు వరకు నగదు ఉంటుందని అంచనా. అయితే సోమవారం భజన జరుగుతున్న సందర్భంగా ఓ అగంతుకుడు వచ్చి హుండీలో ఒక నాణెం వేసి నగదు ఉందా లేదా అనేదానిపై అంచనా వేసి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆలయ అర్చకుడు ధర్మలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వజ్రపుకత్తూరు ఎస్ఐ బి.నిహార్, శ్రీకాకుళం నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. దుండగులు పట్టుకున్న ఆలయ తలుపులు, స్టీల్ గ్రిల్స్పై క్లూస్ టీం సభ్యులు వేలిముద్రలు సేరించారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు సేకరించారు. ఆలయాన్ని కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, సీఐ తిరుపతి పరిశీలించి రెండు రోజుల్లో దొంగలను పట్టుకుని తీరుతామని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీ, వేలిముద్రల ఆధారంగా దర్మాప్తు చేపడుతున్నామని ఎస్ఐ బి.నిహార్ వెల్లడించారు.
ఏడాది క్రితం దొంగతనం
కాగా ఇదే ఆలయంలో ఏడాది కిందట చోరీ జరిగింది. అప్పుడు శివలింగంకు అలంకరించిన నాగాభరణం, ఇతర విలువైన ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. అప్పట్లో ఈ దొంగతనం సంచలనం కలిగించగా.. పోలీసులు ఆభరణాలను రికవరీ చేసి ట్రస్టీలకు అప్పగించారు. అప్పట్లో దొంగలు శివాలయంలో ఉన్న సీసీ ఫుటేజీ నిక్షిప్తమైన డీవీర్ను సైతం తమతో పాటు ఎత్తుకెళ్లారు. కాాగా ఇప్పుడు వారం రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్ ఉదంతం మర్చిపోక ముందే మళ్లీ శివాలయంలో చోరీ జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.


