పలాస: ప్రజా ఉద్యమాలకు కామ్రేడ్ నాగన్న గానం ఉత్తేజమని, సాంస్కృతికోద్యమాన్ని బలోపేతం చేయడమే నాగన్నకు మనమిచ్చే నిజమైన నివాళి అని వివిధ విప్లవ ప్రజా సంఘాల నాయకులు అన్నారు. మండలంలోని బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద నాగన్న సంతాప సభను మంగళవారం నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సంతాప సభకు ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు సొర్ర రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అరుణోదయ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ.. నాగన్న జీవిత విశేషాలను వివరించారు. అతి పేద కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయి కళాకారుడుగా ఎదిగిన క్రమాన్ని చెప్పారు. సీపీఎం ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నియమ నిబంధనలను దాటలేదన్నారు. గాయకునిగా సినీ అవకాశాలు వచ్చినా.. పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఆర్.నారాయణమూర్తి సినిమాకు పాట పాడారని గుర్తు చేశారు. శ్రీకాకుళం పోరాటాన్ని కీర్తిస్తూ ఆట పాటలతో జనాలను ఉర్రూతలూగించారని పేర్కొన్నారు. ఆయన లేని లోటు ప్రజా ఉద్యమాలకు, ముఖ్యంగా సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, విప్లవ పార్టీల నాయకులు వంకల మాధవరావు, జోగి కోదండరావు, పత్తిరి దానేసు, తామాడ సన్యాసిరావు, కుత్తుం వినోద్, నిశితాసి, పుచ్చ దుర్యోధనరావు, ఎస్.సోమేశ్వరరావు, కొర్రాయి నీలకంఠం, ఎం.వినోద్, పి.కుసుమ, కృష్ణవేణి, నేతింటి నీలంరాజు, గొరకల బాలకృష్ణ, జుత్తు వీరాస్వామి, సాలిన వీరాస్వామి, సార జగన్, బి.ఈశ్వరమ్మ, వంకల పాపయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నాగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


