అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో భక్తులకు ఆదివారం కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు రావడంతో ఒకవైపు పోలీస్ శాఖ, మరోవైపు దేవదాయ శాఖలు తమదైన శైలిలో తమ యాప్లను ఇన్స్టాల్ చేయించేలా భక్తుల వెంటపడ్డారు. మహిళలు శక్తి యాప్ తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోవాలని మహిళా పోలీస్ సిబ్బంది భక్తుల వెంట పడుతుంటే.. స్వామివారి దర్శనాలు, ప్రసాదాలకు మన మిత్ర యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలంటూ ఆలయ సిబ్బంది కుస్తీ పడ్డారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వంలో ఇన్స్టాల్ చేసుకున్న దిశ యాప్ ఇంకా ఉందని కొందరు మహిళలు చెప్పడం విశేషం.


