ఆటో బోల్తా
● పలువురికి గాయాలు
టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలంలోని వడ్డితాండ్ర గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆటోలో మహేంద్రగిరి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఒడిశా రాష్ట్రం గారబంద వద్ద ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో సంతబొమ్మాళి మండలంలోని వడ్డితాండ్రకి చెందిన ఎన్.వాసు, ఎన్.శాంతి, ఎన్.లక్ష్మి, ఎల్.ధనలక్ష్మితో పాటు కొత్తూరుకు చెందిన ఎ.హీరమ్మ గాయపడ్డారు. గాయపడిన వారిని ఆటోలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు.
సౌండ్ సిస్టం సామగ్రి దగ్ధం
సంతబొమ్మాళి: మండలంలోని కొల్లిపాడు గ్రామంలో దూపాన భాస్కరరావుకు చెందిన సౌండ్ సిస్టం సామగ్రి దగ్ధమయ్యాయి. గ్రామంలోని ఒక ఇంట్లో ఈ సామగ్రి ఉండగా.. శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు రూ.20 లక్షల నష్టం వచ్చినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. కాగా ప్రమాదానికి గల కారణం తెలియలేదు.
తేనెటీగల దాడిలో
పలువురికి గాయాలు
టెక్కలి రూరల్: మండలంలోని అయోధ్యపురం పంచాయతీ పరిధి చొంపాపురం గ్రామ సమీపంలో ఉన్న గెడ్డ వద్ద ఆదివారం తేనెటీగలు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చొంపాపురం గ్రామానికి చెందిన పి.రంగారావు, పి.రాంప్రసాద్లు గ్రామ సమీపంలోని గెడ్డ వద్దకు వ్యక్తిగత పనులు నిమిత్తం వెళ్లారు. అయితే అదే సమయంలో అక్కడ చెట్టుపైనున్న తేనెపట్టు ఒక్కసారిగా కదలడంతో తేనెటీగలు ఇరువురిపై దాడి చేశాయి. అలాగే అదే సమయంలో అటుగా గుడి నుంచి వస్తున్న ఎస్.ఆదిలక్ష్మిపై సైతం దాడి చేశాయి. అలానే కొంతదూరంలో ఉన్న వృద్ధుడు ఎన్.సోమేశ్వరరావుతో పాటుగా డి.ముకుంద అనే వ్యక్తిపై సైతం దాడి చేశాయి. దీంతో గాయపడిన వారిని హుటాహూటీన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు.
రణస్థలం: లావేరు మండలంలోని అదపాక జాతీయ రహదారి వంతెన పైన శనివారం రాత్రి చేప పిల్లలతో బొలేరో వ్యాను బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లావేరు పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. వ్యానులో ఉన్న డ్రైవర్, క్లీనర్కు ఎటువంటి గాయాలు కాలేదు. దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు.
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ కెమికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతూ.. కళాశాల ఆవరణలోని నాగవళి హాస్టల్లో ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం తన గది నుంచి ఆమె ఎంతకూ బయటకు రాలేదు. దీంతో, తోటి విద్యార్థులు వెళ్లి చూడగా గదిలో తాడుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి, హాస్టల్ అధికారులకు ఈ విషయం చెప్పారు. దీంతో, అధికారులు సర్పవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గదిలో లభించిన ఆధారాలు, లేఖల ఆధారంగా అరుణ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా
ఆటో బోల్తా


