కుక్క అడ్డు రావడంతో..
● అదుపు తప్పిన బైక్ ● యువకుడు దుర్మరణం
నందిగాం: పెద్దతామరాపల్లి–తూముకొండ రహదారిలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. నందిగాం పోలీసులు , గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హుకుంపేటకు చెందిన ముద్దాడ కుమారికి సంతబొమ్మాళి మండలం పాలతలగాంకు చెందిన వ్యక్తితో వివాహం జరిగి కుమారుడు పుట్టాక మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి కుమారుడు ఖగేశ్వరరావు(23)తో కలిసి కన్నవారింట హుకుంపేటలోనే నివసిస్తోంది. ఖగేశ్వరరావు తాత కోనారి బైరాగి ఇంట దేవుడి సంబరం జరుగుతోంది. సంబరానికి అవసరమైన శతమానం తీసుకురావాలని ఖగేశ్వరరావుకు తల్లి చెప్పింది. దీంతో ఖగేశ్వరరావు ద్విచక్ర వాహనంపై టెక్కలి వెళ్లి శతమానం కొనుక్కొని తిగిరి హుకుంపేట వస్తుండగా కర్లపూడి వద్ద కుక్క అడ్డురాగా సడెన్ బ్రేక్ వేశాడు. బండి నుంచి జారిపడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కూలి పనులు చేస్తు డిగ్రీ వరకు చదివించిన కుమారుడు ఇలా అర్ధంతరంగా మృతిచెందడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ మేరకు తల్లి కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలిగాంలో దొంగల హల్చల్
మందస: బాలిగాం గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు.శనివార రాత్రి కిల్లి శారదమ్మ ఇంట్లో తులమున్నర బంగారం, వల్లభ భూదేవి ఇంట్లో ఆరు తులాల వెండి పట్టుకుపోయా రు. మార్పు భుజంగరావు ఇంట్లో బీరువాలను తెరిచి చిందర వందరగా పడేశారు. ఆదివారం విషయం వెలుగు చూడటంతో కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


