శ్రీకాకుళం : నగరంలోని మంగువారితోట, దండి వీధి, లెప్రసీ కాలనీ తదితర ప్రాంతాల్లో మళ్లీ డయేరియా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం రెండు కేసులు ఈ ప్రాంతం నుంచి నమోదై లెప్రసీ కాలనీలోని ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు పొందగా బుధవారం వారి ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో డిశ్చార్జ్ చేశారు. వారు వెళ్లిన క్షణాల్లోనే లెప్రసీ కాలనీ నుంచి మరో ఇద్దరు వచ్చి ఆరోగ్య కేంద్రంలో చేరారు. ఆ ప్రాంతంలో చాలామందికి డయేరియా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం సరికి ఈ సర్వేను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: ఖేలో ఇండియా సౌత్జోన్ పెన్కాక్ సిలాట్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు కేరళలో జరిగిన సౌత్జోన్ అస్మిత ఖేలో ఇండియా పెన్కాక్ సిలాట్ ఉమెన్స్ లీగ్ పోటీల్లో జూనియర్స్ విభాగంలో సాహుకారు సహస్ర, చింతపల్లి హేమసుధ కాంస్య పతకాలు సాధించగా, నేతింటి చరిష్మా, అన్నెపు భార్గవి గట్టి పోటీనిచ్చారు. కోచ్ మాకివలస గౌతమి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రేగిడి దయామయ, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్ నాయుడు క్రీడాకారులను అభినందించారు.


