రైలు ఢీకొని ఉపాధ్యాయుడికి గాయాలు
పాతపట్నం: గుణుపూర్ నుంచి రూర్కెలా వెళుతున్న రాజరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని కొదూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మాలువ సింహాచలం తీవ్రంగా గాయపడ్డాడు. పాతపట్నం రైల్వేస్టేషన్ సమీపంలోని హౌసింగ్బోర్డు కాలనీ వద్ద శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం నేపథ్యంలో సుమారు 20 నిమిషాలు రైలు నిలిపివేశారు. క్షతగాత్రుడిని పాతపట్నం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సింహాచలం స్టువట్పేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పాతపట్నంలోని బాలాజీనగర్–3లో నివాసం ఉంటున్నాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
వలస కూలీకి గాయాలు
టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలం నౌపడ సమీపంలో ఆర్అండ్ఆర్ కాలనీలో పనులు చేస్తున్న వలస కూలీ శుక్రవారం ప్రమాదశాత్తు గాయపడ్డాడు. పార్వతీపురం మండలానికి చెందిన వై.కళ్యాణకుమార్ నౌపడ ఆర్అండ్ఆర్ కాలనీలో జరుగుతున్న గృహనిర్మాణ పనుల్లో భాగంగా కర్ర పని చేస్తుండగా కటింగ్ మిషన్ కాళ్లపై పడింది. కాళ్లకు తీవ్ర గాయం కావడంతో వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.


