సాక్షి, పుట్టపర్తి
పుట్టపర్తికి తాగునీటి అందించేందుకు చేపట్టిన ‘నాన్ అమృత్ స్కీం’కు సంబంధించిన భారీ పైపులను కాంట్రాక్టర్లు పుట్టపర్తి శివారున ఉంచారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే సింధూరారెడ్డి హడావుడిగా పనులు ప్రారంభించారు.. ఆ తర్వాత వాటి గురించి మరచిపోయారు. దీంతో రూ.కోట్లు విలువ చేసే పైపులపై ‘తెలుగు తమ్ముళ్ల’ కన్ను పడింది. రాత్రికి రాత్రే భారీ యంత్రాల సాయంతో మాయం చేసినట్లు తెలిసింది. అయితే మరుసటి రోజే సదరు కాంట్రాక్టర్ పుట్టపర్తి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందులో కొందరి పేర్లు కూడా పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఎవరి పేర్లు ఉన్నాయనే విషయంపై పోలీసులు గోప్యంగా ఉంచారు. యజమాని ఫిర్యాదు చేస్తే విచారణ చేసి కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటి వరకు కేసు లేకపోవడంపై భారీ చర్చ నడుస్తోంది.
‘తెలుగు తమ్ముళ్లే’ దొంగలు..
పుట్టపర్తి పట్టణానికి చెందిన ఇద్దరు.. బుక్కపట్నం మండలానికి చెందిన మరో తెలుగు తమ్ముడి కనుసన్నల్లోనే పైపుల చోరీ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా అంతటి భారీ పైపులు ఎత్తుకెళ్లాలంటే క్రెయిన్ తప్పనిసరి. అంతేకాకుండా ఓ పెద్ద గూడ్స్ వాహనం అవసరం. ముగ్గురు తెలుగు తమ్ముళ్ల తోడుగా ఇద్దరు డ్రైవర్లు.. పైపులు కొనే వ్యక్తి.. కలిపి మొత్తంగా పది మంది పైపుల చోరీలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ముఖ్య పాత్రదారులంతా టీడీపీ కార్యకర్తలు కావడంతోనే.. సమస్య బయటికి రాకుండా కప్పిపెట్టినట్లు తెలుస్తోంది. దొంగలెవరన్న విషయం ఊరంతా కోడై కూస్తున్నా...ఈ విషయం పోలీసులకూ తెలిసినా.. పట్టించుకోలేని పరిస్థితి. ‘ఫలానా వ్యక్తి దొంగ’ అని జనమే బహిరంగంగా చర్చించుకుంటున్నా.. ఏమీ చేయలేని స్థితిలో పోలీస్ వ్యవస్థ ఉంది. బైండోవర్లు.. ఉల్లంఘనలు.. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు టీడీపీ నాయకులు చెప్పినట్లు వింటూ అక్రమ కేసులు బనాయించడానికేనా పోలీసులు అంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది.
సీసీ కెమెరాలు చూసినా...
పుట్టపర్తి శివారు నుంచి ఎటు వైపు వెళ్లినా.. కిలోమీటరు దూరంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. భారీ పైపులతో వెళ్లే వాహనాన్ని పసిగట్టడం గంటల వ్యవధిలో పూర్తయ్యే పని. అయితే సీసీటీవీ ఫుటేజీల గురించి నేటికీ పోలీసులు పట్టించుకోలేదు. మాజీ మంత్రి ‘పల్లె’ జోక్యంతో పోలీసులు కేసును పట్టిచుకోలేదని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. అంతిమంగా కోటి విలువైన పైపులను దర్జాగా దొంగలించి వాటిని అమ్ముకుని తలా కొంచెం వాటాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో పోలీసులకూ వాటా ఉందని అందుకే పైపుల చోరీపై కేసు కూడా కట్టకుండా తాత్సారం చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు.
భారీ చోరీ.. రూ.కోట్లు విలువ చేసే తాగునీటి పైపులు మాయం. ఊరంతా తెలిసింది. పోలీసులకూ ఫిర్యాదు వెళ్లింది. కానీ రెండు వారాలు గడుస్తున్నా కేసు నమోదు లేదు. యజమాని నుంచి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతుండగా.. దొంగలు ‘తెలుగు తమ్ముళ్లు’ కావడంతో కేసు నీరుగారుతోందన్న చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి ‘పల్లె’ జోక్యం చేసుకోవడంతో దొంగలను పట్టుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నట్లు తెలిసింది.
దొంగ ‘తమ్ముళ్లకు’ ‘పల్లె’ దన్ను!
ఊరంతా తెలిసిన దొంగలు
ఖాకీలకు తెలియదంట
రెండు వారాలైనా కేసు కూడా
నమోదు చేయని వైనం
గట్టిగా అడిగితే
ఫిర్యాదే రాలేదంటున్న పోలీసులు
‘పల్లె’ దుప్పటి పంచాయితీతో
అందరూ మౌనం
రూ.కోటి విలువ చేసే
తాగునీటి పైపుల చోరీ కథ కంచికి


