ముదిగుబ్బ: మండల కేంద్రంలోని శివ పంచాయతన దేవాలయంలో శనివారం అఖిల గాండ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మేడాపురం గ్రామానికి చెందిన తుంపెర సందీప్ కుమార్, బీకే అశ్విత, బసంపల్లికి చెందిన వినీత్కుమార్, కూటాగుళ్లకు చెందిన హర్షవర్ధన్, పాముదుర్తికి చెందిన మహతిని సత్కరించారు. గోరంట్ల మండలం ఎగువ గంగంపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామచంద్రప్పను సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల గాండ్ల సంక్షేమం సంఘం జిల్లా అధ్యక్షుడు సీవీ కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి గార్లదిన్నె మల్లికార్జున, కోశాధికారి పుట్టపర్తి నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యాలు శ్రీనివాసులు హాజరయ్యారు.


