ప్రశాంతి నిలయం: లోక కల్యాణార్థం అవతరించిన యుగావతారి సత్యసాయి అన్న సందేశాన్నిస్తూ భక్తులు నిర్వహించిన బుర్రకథా కాలక్షేపం ఆకట్టుకుంది. పర్తియాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంగారెడ్డి జిల్లా సత్యసాయి భక్తులు పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. శనివారం ఉదయం వందలాది మంది భక్తులు సామూహికంగా సత్యసాయి చాలీసా పఠించారు. సాయంత్రం యుగావతార్ పేరుతో సత్యసాయి యువత బుర్రకథా కాలక్షేపం నిర్వహించారు. సత్యసాయి పుట్టుక, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక బోధనలను వివరిస్తూ చక్కటి సందేశంతో సాగిన బుర్రకథతో భక్తులు మైమరచిపోయారు.


