హిందూపురం టౌన్: ప్రతి యేటా అంగరంగ వైభవంగా జరిగే వినాయక చవితి వేడుకలకు గణనాథుల విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. వేడు కలకు నెల రోజుల నుంచే సందడి మొదలైంది. ఓ వైపు వీధుల్లో మండపాలు ఏర్పాటవుతుండగా, గణనాథుల విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. హిందూపురం పట్టణంలోని బెంగళూరు రోడ్డు, కొట్నూరు, మేళాపురం వద్ద వినాయక విగ్రహాల తయారీ ఊపందుకుంది. డిమాండ్కు తగ్గట్టుగానే విగ్రహాల ధరలు ఆకాశాన్నంటాయి. హిందూపురంలో అడుగుల వారీగా రూ.5 వేల నుంచి రూ.5 లక్షల దాకా వినాయక విగ్రహాల ధరలు పలుకుతున్నాయి.
రూ.కోట్లలో వ్యాపారం
హిందూపురంలో వినాయక చవితి అంటే రూ. కోట్లలో వ్యాపారం జరుగుతుంది. వినాయక మండపాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి విగ్రహాం తయారీ, డెకరేషన్, పూజా సామగ్రి, లైటింగ్, టపాసులు, డీజేలు, నిమజ్జన ఖర్చులు ఇలా ఎన్నో హంగు, ఆర్భాటాలు ఉంటాయి. అన్నింటికంటే వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించడానికి ఎంత ఖర్చునైనా భరించాల్సిందే. హిందూపురం పట్టణంలో పలు చోట్ల ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టి వినాయకుల విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. హిందూపురంతో పాటు లేపాక్షి, చిలమత్తూరు, పరిగి మండలాలు, పెనుకొండ, పుట్టపర్తి, మడకశిర, కదిరి, ధర్మవరం, కర్ణాటక ప్రాంతాలకు చెందిన వారు తరలివచ్చి వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ 5 అడుగల విగ్రహాల నుంచి 40 అడుగుల విగ్రహం వరకు తయారు చేస్తుంటారు. భారీ విగ్రహాలను ముందస్తు ఒప్పందం ప్రకారం తయారీ చేస్తారు. లేదా హిందూపురం పట్టణంలో అయితే మండపం ఉన్న చోటుకే వెళ్లి తయారు చేస్తున్నారు. గతంతో పోలిస్తే వినాయక విగ్రహాల ధరలు భారీగానే పెరిగాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, గడ్డి, రంగులు, కట్టెలు, కొబ్బరి పీచు ఇలా ముడి వస్తువుల ధరలు పెరగడంతో వినాయక విగ్రహాల ధరలు ౖపైపెకి చేరాయి. గత ఏడాది మట్టి వినాయకుడి 18 అడుగుల విగ్రహం రూ.1.50 లక్షల వరకు ధర ఉండగా, ఇప్పుడు రూ.2 లక్షలకు చేరింది. విగ్రహాల తయారీ భారం పెరగడంతోనే ధరలు పెంచక తప్పడం లేదని తయారీదారులు చెబుతున్నారు. అడుగుల వారీగా మట్టి విగ్రహాలను చూసినా (భారీ అడుగుల వినాయకులు) గత ఏడాది అడుగుకు రూ.6 వేల నుంచి రూ.7 వేలు తీసుకునే వారు. ప్రస్తుతం రూ.9 వేల నుంచి రూ.10 వేలు తీసుకుంటున్నారు. బేరసారాల్లో మరికొంత తగ్గొచ్చు. అదే విధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు 12 అడుగులు, 16 అడుగులవి రూ. రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఉన్నాయి.
ఆకాశాన్నంటుతున్న
గణపతి విగ్రహాల ధరలు
ముడి సరుకులు,
రవాణా భారంతో రేట్లు ౖపైపెకి
అడుగుల వారీగా
రూ.5 వేల నుంచి 5లక్షల వరకు..
ధర ఎక్కువైనా కొనుగోలుకే మొగ్గు
మట్టి విగ్రహాలకే మొగ్గు
హిందూపురంలో యేటా 200 వరకు విగ్రహాలు కొలువుదీరుస్తుంటారు. ఎక్కువగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడానికే మొగ్గు చూపుతారు. ధరలు ఎంత పెరిగినప్పటికి పర్యావరణానికి ముప్పు వాటిల్లని, మంచి రూపును ఇచ్చే మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. వివిధ ఆకృతులతో మట్టి విగ్రహాలను తయారీదారులు తీర్చిదిద్దుతుంటారు. మట్టి విగ్రహాలను భారీ అడుగుల్లోనూ తయారీదారులు రూపొందిస్తున్నారు. 40 అడుగుల వరకు తయారు చేస్తున్నారు. ఇవి పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.


