పొలం వద్ద నీటిని పట్టుకుంటున్న దొన్నికోటవారిపల్లి గ్రామస్తులు
ఉంట్లవారిపల్లిలో నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రజలు
ఓడీచెరువు: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై ప్రజలలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని దొన్నికోటవారిపల్లిలో 20 రోజుల నుంచి పంచాయతీ బోర్లలో నీళ్లు రావడం లేదు. దీంతో ప్రజలు ఖాళీ బిందెలతో పంట పొలాలవైపు పరుగులు తీస్తున్నారు. పలు మార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని, ఇంకెన్నాళ్లు ఈ కష్టాలు పడాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉంట్లవారిపల్లిలో బోరు ఉన్నా మోటారు రిపేరు చేయించకపోవడంతో పది రోజుల నుంచి తాగునీటికి అష్టకష్టాలు పడుతున్నారు. పనులన్నీ మానుకొని నీటి కోసం ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. బోరు మరమ్మతు చేయడంలో స్థానిక అధికార పార్టీ నాయకులు పోటీ పడుతుండటంతో ఆ పని ఆగిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే కమ్మవారిపల్లి పంచాయతీ అచ్చామియాపల్లిలో సైతం స్థానికులకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. అన్ని చోట్లా గ్రామీణులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు.


