పగలు కొబ్బరి బోండాల వ్యాపారం...
అగళి: పగటిపూట కొబ్బరి బోండాలు అమ్ముతూ ... రాత్రి వేళల్లో మాత్రం వ్యవసాయ పొలాల వద్ద మోటార్లకున్న కేబుల్ను అపహరించే దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలమేరకు.. మండల పరిధిలోని నందరాజన్నపల్లికి చెందిన తిప్పన్న, హెచ్డీ హళ్లి తండాకు చెందిన ఆనందనాయక్ రైతుల నుంచి కొబ్బరి బోండాలను తీసుకొని అమ్ముకునేవారు. అయితే రాత్రి సమయంలో మాత్రం దొంగలుగా మారి రైతుల పొలాల్లో మోటర్లుకు అమర్చిన కేబుల్ను అపహరించేవారు. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం శిర తాలూక దావూసపాళ్యం వద్ద పాత వస్తువులు తీసుకునే వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకునేవాళ్లు. ఈ నేపథ్యంలో రైతులు తమ పొలాల్లో కేబుల్ దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల పాత వస్తువులను తీసుకునే వాళ్లకు కేబుల్ తీసుకొని ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు దొంగలు కేబుల్ను అపహరించి దావూసపాళ్యంలో పాత వస్తువులు కొనే యజమానికి అమ్మేందుకు యత్నించారు. అతను వారి వీడియోను పోలీసులకు పంపడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఆరు నెలల నుంచి మండల పరిధిలోని అనేక వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ను చోరీ చేశారని రైతులు చెబుతున్నారు.


