కదిరిటౌన్: మైనార్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వక్తలు అన్నారు. కదిరిలో శుక్రవారం క్రైస్తవుల సమాఖ్య కదిరి ఫెలోషిప్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సమానత్వాన్ని మరింత బలోపేతం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. సమాజాభివృద్ధికి విద్య, అవగాహన, ఐక్యత, రాజ్యాంగ విలువలపై నమ్మకం ఎంతో అవసరమన్నారు. సిమ్స్ హాస్పిటల్ ఎండీ నిసార్యాసీన్ మాట్లాడుతూ మైనారిటీలు, పేదలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సభలో మైనార్టీ వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులు, రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. మైనార్టీ వర్గాలపై చోటుచేసుకుంటున్న దాడులు, వివక్ష వంటి ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వం, మత స్వేచ్ఛ వంటి విలువలను కాపాడుకుంటూ అన్ని వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులు, ముస్లింలు, వెనుకబడిన వర్గాల పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి.. రాజ్యాంగ పరిధిలో తగిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో క్రైస్తవుల సమాఖ్య కదిరి ఫెలోషిప్ కమిటీ సభ్యులు, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు, సంఘపెద్దలు, యువత, మైనారిటీ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్


