లేపాక్షి: భూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రీసర్వే వివరాలు పక్కాగా ఉండాలని, అప్పుడే తప్పుల్లేని పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు పంపిణీ చేయడం సాధ్యమవుతుందని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన లేపాక్షి మండలంలో పర్యటించారు. తొలుత స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వర్షపు నీరు ఇంకేలా వీబీజీ రాంజీ పథకంలో తవ్వుతున్న ఇంకుడు గుంత నిర్మాణ పనికి భూమి పూజ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ‘సర్’కు సంబంధించి బీఎల్ఓ, బీఎల్ఏ సమావేశ రికార్డులు పరిశీలించారు. అన్కలెక్టబుల్ ఓటర్లుగా వర్గీకరించిన జాబితాలోని మృతులు, ఆచూకీలేని వారు, మరో ప్రాంతంలో ఓటు నమోదు చేసుకున్న వారి వివరాలను పరిశీలించారు. అనంతరం శిరివరంలోని జరుగుతున్న రీసర్వే గ్రౌండ్ ట్రూథిలింగ్ పనులు కలెక్టర్ పరిశీలించారు. సర్వేపై రైతులకు, సిబ్బంది తగిన సూచనలు ఇచ్చారు. అదేవిధంగా మొక్కజొన్న పంట నమోదును ఆయన పరిశీలించారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది పనితీరు, హాజరు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎంపీడీఓ వాసుదేవరెడ్డి, ఏపీడీ శివానందనాయక్తో పాటు అధికారులు ఉన్నారు.
రీసర్వే సిబ్బందికి కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం


