అనంతపురం: అనంతపురం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ (ఏడీఎఫ్ఏ) ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగిన ఏపీ రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్బాల్ టోర్నీ విజేతగా శ్రీసత్యసాయి జిల్లా జట్టు నిలిచింది. ఈ నెల 24న ప్రారంభమైన ఈ టోర్నీ ఆదివారంతో ముగిసింది. ఫైనల్స్లో తూర్పుగోదావరి జట్టుతో తలపడిన శ్రీసత్యసాయి జట్టు క్రీడాకారులు ఆఖరి క్షణం వరకూ విజయం కోసం శ్రమించారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరి క్షణంలో శ్రీసత్యసాయి జట్టు ఒక్క గోల్ సాధించి విజయకేతనం ఎగురవేసింది. అలాగే మూడో స్థానం కోసం అనంతపురం, కర్నూలు జట్లు తలపడగా.. అనంతపురం బాలికలు ఆది నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు. కర్నూలు క్రీడాకారులను ముప్పుతిప్పలు పెడుతూ 0–4 గోల్స్ తేడాతో విజయకేతనం ఎగుర వేశారు. దీంతో నాల్గో స్థానంతో కర్నూలు జట్టు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముగింపు కార్యక్రమానికి ఎన్ఐసీ కోచ్ ఇస్మాయిల్ (పోలీస్ ఇన్స్పెక్టర్), ఏడీఎఫ్ఏ అధ్యక్షుడు దాదాఖలందర్,ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కోశాధికారి మల్లేష్, కృష్ణా జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ హాజరై, విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేసి, అభినందించారు.
మడకశిర: మడకశిర కెనరా బ్యాంక్లో వెలుగు చూసిన దా‘రుణ’ బాగోతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని ఇతర బ్యాంకుల అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కెనరా బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి వందలాది మంది రుణాలు తీసుకున్నారు. ఈ ఆభరణాలను ఏటా ఆడిట్ అధికారులు పరిశీలిస్తారు. అందులో భాగంగానే ఇటీవల ఆభరణాలను తనిఖీ చేయగా బండారం బయటపడింది.
సూత్రధారి బ్యాంక్ అప్రైజరే..
మడకశిర కెనరా బ్యాంక్ అప్రైజర్ సుందరేశ్ చారి కొంతమందితో కుమ్మక్కై నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు.గుడిబండ మండలం ఎస్.రాయాపురం గ్రామానికి చెందిన సుందరేశ్ చారి కొన్నేళ్ల నుంచి బ్యాంకులో అప్రైజర్గా పని చేస్తున్నాడు. ఇతను 12 మంది ఖాతాదారులకు నకిలీ బంగారు ఆభరణాల ద్వారా రూ.70.66 లక్షల రుణాలు మంజూరు చేయించి బ్యాంకుకు టోకరా వేశాడు. మడకశిర మండలం బుళ్లసముద్రం గ్రామానికి చెందిన బీ.సత్యనారాయణ పేరున రెండు ఖాతాలు తెరిచి రూ.8.49 లక్షలు కాజేశాడు. అలాగే, మడకశిరకు చెందిన ఎస్.బాలక్రిష్ణ పేరున రెండు అకౌంట్లు తెరిచి రూ.13.58 లక్షలు, హరేసముద్రం గ్రామానికి చెందిన ఏజీ రత్నమ్మ పేరున రెండు ఖాతాలు తెరిచి రూ.9.70 లక్షలు, గొల్లహట్టికి చెందిన జీ.ప్రకాశ్ పేరున రెండు ఖాతాలు ఓపెన్ చేసి రూ.15.80 లక్షలు, హరే సముద్రం గ్రామానికి చెందిన ధనుంజయ పేరుపై రెండు ఖాతాలు తెరిచి రూ.11.39 లక్షలు, జిల్లేడుగుంట గ్రామానికి చెందిన డీ. అడివన్న ఖాతా ద్వారా రూ.5 లక్షలు, హరేసముద్రం గ్రామా నికి చెందిన చిన్నపూజారి ధనుంజయ ఖాతా ద్వారా రూ.6.70 లక్షలు.. ఇలా మొత్తం 12 మందికి రూ.70.66 లక్షలు మంజూరు చేయించాడు. ఆ తర్వాత అందరూ కలిసి పంచుకుతిన్నారు. మడకశిర నియోజకవర్గంలో వివిధ బ్యాంకుల బ్రాంచ్లు దాదాపు 30 ఉన్నాయి. అన్ని బ్యాంకుల్లో బంగారు ఆభరణాలపై రూ.కోట్లలో రుణాలు మంజూరు చేశారు. కెనరా బ్యాంకులో బాగోతం నేపథ్యంలో ఆయా బ్యాంకుల అధికారులు అప్రమత్తమైనట్లు తెలిసింది. బంగారు ఆభరణాలను పరిశీలించడానికి ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం.
పరారీలో నిందితులు..
నకిలీ ఆభరణాల తాకట్టు వ్యవహారంపై కెనరా బ్యాంక్ ఏజీఎం శ్రీనివాసులు మడకశిర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అప్రైజర్ సుందరేశ్చారితో పాటు రుణాలు పొందిన సత్యనారాయణ, చిన్నపూజారి ధనుంజయ, అడివన్న, ధనుంజయ, ప్రకాశ్, రత్నమ్మ, బాలక్రిష్ణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. బాగోతం వెలుగులోకి రాగానే నిందితులందరూ పరారయ్యారు.
నిందితులను పట్టుకుంటాం
కెనరా బ్యాంక్ ఏజీఎం శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం. త్వరలోనే అరెస్ట్ చేస్తాం.
–కృష్ణారెడ్డి, ఎస్ఐ, మడకశిర


