హిందూపురం: ప్రజల భద్రతకే పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలోని ప్రతి ఆటోకు సదరు ఆటో పూర్తి వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ ిస్టిక్కర్లను అతికిస్తున్నామన్నారు. శనివారం ఆయన హిందూపురం ఎంజీఎం క్రీడా మైదానంలో 196 ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి యాప్ పనితీరు గురించి వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..ప్రయాణికులు ఆటోల్లో ఏదైనా వస్తువు మరచిపోయినా...ఇంకేదైనా సమస్య తలెత్తినా ఆటోలోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క్షణాల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. అలాగే డ్రైవర్ వివరాలతోపాటు లైవ్ లొకేషన్ సహా 8 భద్రతా సేవలు అందుబాటులో వస్తాయన్నారు. నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 10 వేల ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అతికించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆటో డ్రైవర్లు కూడా గడువులోపు తమ ఆటోలకు క్యూఆర్కోడ్ స్టిక్కర్లను అతికించుకోవాలని, లేకపోతే పోలీసుల తనిఖీల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, రవాణా శాఖ అధికారి శ్రీనివాసులు, సీఐలు రాజగోపాల్ నాయుడు, ఆంజనేయులు, జనార్దన్, అబ్దుల్ కరీం, ఎ్స్ఐలు, మున్సిపల్, రవాణా శాఖ సిబ్బంది, 13 ఆటో యూనియన్ యూనియన్ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఎస్పీ సతీష్కుమార్ వెల్లడి
‘పురం’లో ఆటోలకు క్యూర్ కోడ్ స్టిక్కర్లు


