హిందూపురం: ‘‘హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే’’ అంటూ భక్తులు తన్మయత్వంలో శ్రీకృష్ణుడిని కీర్తించగా పురం వీధులు కృష్ణనామంతో ప్రతిధ్వనించాయి. మేళతాళాలు.. సంకీర్తనలు..కోలాటాలు.. భజనలతో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో గురువారం హిందూపురంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగింది. తొలుత ముదిరెడ్డిపల్లిలోని చౌడేశ్వరీ ఫంక్షన్ హాలులో శ్రీకృష్ణ బలరామ సుభద్రాదేవి విగ్రహాలకు పూజలు నిర్వహించి ప్రత్యేకంగా సిద్ధం చేసిన రథంపై కొలువుదీర్చారు. అనంతరం ఇస్కాన్ ప్రతినిధి శ్రీకృష్ణ మాధవదాస్ ప్రభు ఆధ్వర్యంలో అశేష భక్త జనం నడుమ జగన్నాథుని రథయాత్ర నిర్వహించారు. ముదిరెడ్డిపల్లి నుంచి ప్రారంభమైన రథయాత్ర పురవీధుల గుండా భక్త జనులు ఆనందోత్సవాలతో మేళాపురం, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సర్కిల్, రైల్వేరోడ్డు మీదుగా వాసవీ ధర్మశాల ఫంక్షన్ హాలు వరకూ సాగింది. అనంతరం రథానికి పూజలు చేసిన అర్చకులు శ్రీకృష్ణ బలరామ సుభద్రదేవి ఉత్సవ మూర్తులను కల్యాణ మండపంలో కొలువుదీర్చి పూజలు చేశారు. ప్రత్యేక భజనలు, తులసీపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐలు రాజగోపాల్ నాయుడు, అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
హిందూపురంలో వైభవంగా
జగన్నాథ రథయాత్ర
మార్మోగిన శ్రీకృష్ణ నామం..
పరవశం చెందిన భక్తజనం


